కొమరం భీం పోరాట యోధుడు

ABN , First Publish Date - 2021-10-23T05:15:03+05:30 IST

కొమరం భీం గొప్ప పోరాట యోధుడని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పలువురు పేర్కొన్నారు. కొమరం భీం వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని భీం విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కొమరం భీం పోరాట యోధుడు
భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న అధికారులు, నాయకులు

బోథ్‌, అక్టోబరు 22: కొమరం భీం గొప్ప పోరాట యోధుడని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పలువురు పేర్కొన్నారు. కొమరం భీం వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని భీం విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు కొమరంభీం పోరాట పటిమను కొనియాడారు. భూమికోసం, భుక్తి కోసం నైజాం ప్రభుత్వాన్ని ఎదురించాడన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాధ, ఎస్సై పి.రాజు, ట్రైనీ ఎస్సై అరుణ్‌తో పాటు ఆత్మ చైర్మన్‌ ఎం.సుభాష్‌, సహాకార సంఘం చైర్మన్‌ కె.ప్రశాంత్‌, ఎంపీటీసీ మహేందర్‌తో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, బీజేపీ, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

ఉట్నూర్‌: స్థానిక కుమ్రం భీం కాంప్లెక్స్‌లో ఆదివాపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కుమ్రం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి మంగం మహేశ్వరావు మాట్లాడుతూ  కుమ్రం భీం ఆశయాల స్ఫూర్తితోనే యువత ముందుకు నడవాలన్నారు. కార్యక్రమంలో జంగదేవ్‌, రాజారాం తదితరులు పాల్గొన్నారు. 

ఇచ్చోడరూరల్‌: మండలంలోని దేశ్‌ముఖ్‌నగర్‌ కాలనీలో ఆదివాసులు శుక్రవారం ఘనంగా కొమరంభీం వర్ధంతిని నిర్వహించారు. భీం విగ్రహానికి ఆదివాసీ నాయకులు పూలమాల వేసి ‘జోహార్‌ కొమురం భీం’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడప నగేష్‌, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు ఆత్రం మహేందర్‌, తుడందెబ్బ మహిళా నాయకురాలు పెందూర్‌పద్మ, మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదివాసీల అభ్యున్నతి కోసం జల్‌జంగల్‌ జమీన్‌ పేరుతో పోరాటాలు నిర్వహించి ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపిన కొమరంభీం ఆశయ సాధనకు ప్రభుత్వాలు కృషిచేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొమురంభీం వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక బస్టాండ్‌ ఎదుట భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ఆదివాసీలకు పూర్తిగా అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ఏళ్లు గడుస్తున్నా పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా వారి జీవన విధానాల్లో మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 10శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందులో సీపీఐ నాయకులువామన్‌, పతిహార రమేష్‌, రాములు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T05:15:03+05:30 IST