కొమ్మలపూడిలో ఘనంగా కుంభాభిషేకం
ABN , First Publish Date - 2021-10-24T04:45:49+05:30 IST
మండలంలోని కొమ్మలపూడిలో శుక్రవారం నుంచి మహాకుంభాభిషేకం కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
మనుబోలు, అక్టోబరు 23: మండలంలోని కొమ్మలపూడిలో శుక్రవారం నుంచి మహాకుంభాభిషేకం కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో సీతారామాంజనేయస్వామి దేవస్థానం నిర్మించి 12ఏళ్లు సందర్భంగా ఆలయంలో కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మహోత్సవంలో భాగంగా శనివారం యాజ్ఞికులు దీవి హరినవీన్స్వామి ఆధ్వర్యంలో బుత్విక్కులు యాగశాలలో కలశస్థాపన, విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠలు, నవగ్రహ యజ్ఞం, అగ్నిధాన్యములు, పంచవింశతి కుంభాసాధన కార్యక్రమాలను వేదమంత్రాలు వల్లిస్తూ శాస్త్రోపేతంగా నిర్వహించారు. 25వ తేదీన దాతలు కొండ్రెడ్డి పట్టాభిరామిరెడ్డి, సీతారామమ్మ దంపతులు ఏర్పాటు చేసిన 20అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కిలివేటి సంజీవయ్య, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి రానున్నారని ఆలయ కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగులతో అలంకరించి సుందరంగా తీర్చిదిద్దారు.