మల్లన్నకు లష్కర్ బోనం
ABN , First Publish Date - 2022-01-24T04:58:53+05:30 IST
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం లష్కర్ భక్తులతో పోటెత్తింది. మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంక్రాంతి అనంతరం రెండోఆదివారం సికింద్రాబాద్కు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈమేరకు వేలాదిమంది భక్తులు మల్లన్న దర్శనార్థం తరలివ చ్చారు. ఆలయ ప్రాంగణంలో విక్రయించే కూరగాయలను కొనుగోలు చేసి నూతన మట్టికుండల్లో నైవేద్యం వండి మల్లన్నకు బోనం నివేదించి పట్నాలు వేశారు.
కొమురవెల్లిలో సికింద్రాబాద్ భక్తుల సందడి
కిక్కిరిసిన క్యూలైన్లు
జనసంద్రమైన ఆలయ పరిసరాలు
చేర్యాల, జనవరి 23: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం లష్కర్ భక్తులతో పోటెత్తింది. మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంక్రాంతి అనంతరం రెండోఆదివారం సికింద్రాబాద్కు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈమేరకు వేలాదిమంది భక్తులు మల్లన్న దర్శనార్థం తరలివ చ్చారు. ఆలయ ప్రాంగణంలో విక్రయించే కూరగాయలను కొనుగోలు చేసి నూతన మట్టికుండల్లో నైవేద్యం వండి మల్లన్నకు బోనం నివేదించి పట్నాలు వేశారు. ఒడిబియ్యం పోసి తమను చల్లగా చూడమని వేడుకున్నారు. కోరికలు తీర్చమని ఆలయ ప్రాంగణంలోని గంగరేగు చెట్టుకు ముడుపులు కట్టారు. సంతానం కోసం మహిళలు ఒళ్లుబండ వద్ద వరం పట్టారు. పట్నాలు వేసే భక్తులతో గంగిరేగుచెట్టు ప్రాంగణం కిటకిటలాడింది. మొక్కుబడిగా భక్తులు కట్టిన ముడుపులతో గంగరేగుచెట్టు నిండిపోయింది. మల్లన్నను దర్శించుకున్న భక్తులు స్వామి సోదరి ఎల్లమ్మకు బోనాలు నివేదించారు. డప్పుచప్పుళ్లతో శిగాలు ఊగుతూ ఎల్లమ్మగుట్టపైన వెలసిన అమ్మవారి ఆలయానికి చేరుకుని నైవేద్యం సమర్పించారు. మల్లన్నను తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్గౌడ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. మల్లన్నను దర్శించుకోవడానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. క్యూలైన్లలో స్థలం సరిపోక భక్తులు ఆలయం వెలుప కూడా బారులు తీరారు. గంటల తరబడి ఎండలో పడిగాపులు కాయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఆలయ ఈవో బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ధర్మకర్తలు బొంగు నాగిరెడ్డి, ఉట్కూరి అమర్, తివారి దినేశ్, తాళ్లపల్లి శ్రీనివాస్, కొమురెల్లి, చింతల పర్షరాములు, కొంగరి గిరిధర్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.