కొమురవెల్లి మల్లన్నకు పట్నం పబ్బతి

ABN , First Publish Date - 2022-01-17T05:02:47+05:30 IST

కోరమీసాల కొమురవెల్లి మల్లన్నకు పట్నం భక్తులు పబ్బతి పట్టారు. డప్పుల దరులు, భక్తుల సిగాలు, పోతరాజుల చిందులతో విజయాచల గుట్టలు హోరెత్తాయి. మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంక్రాంతి తరువాత మొదటి ఆదివారం పట్నం వారాన్ని భక్తులు జరుపుకున్నారు. హైదరాబాద్‌ నుంచి లక్ష మంది భక్తులు తరలిరావడంతో కొమరవెల్లి జనసంద్రంగా మారింది. శనివారం సాయంత్రం ఽధూళి దర్శనం చేసుకున్న భక్తులు ఆదివారం భక్తితో బోనాలు తయారుచేసి నైవేద్యాన్ని నివేదించారు.

కొమురవెల్లి మల్లన్నకు పట్నం పబ్బతి
భక్తులతో కిటకిటలాడుతున్న కొమురవెల్లి ఆలయ పరిసరాలు

హోరెత్తిన మల్లన్న పట్నం వారం

భక్తజనసంద్రమైన ఆలయ పరిసరాలు

బోనాలు, పట్నాలతో భక్తుల మొక్కులు

చిరుజల్లులతో ఇబ్బందులు


చేర్యాల, జనవరి 16 : కోరమీసాల కొమురవెల్లి మల్లన్నకు పట్నం భక్తులు పబ్బతి పట్టారు. డప్పుల దరులు, భక్తుల సిగాలు, పోతరాజుల చిందులతో విజయాచల గుట్టలు హోరెత్తాయి. మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంక్రాంతి తరువాత మొదటి ఆదివారం పట్నం వారాన్ని భక్తులు జరుపుకున్నారు. హైదరాబాద్‌ నుంచి లక్ష మంది భక్తులు తరలిరావడంతో కొమరవెల్లి జనసంద్రంగా మారింది. శనివారం సాయంత్రం ఽధూళి దర్శనం చేసుకున్న భక్తులు ఆదివారం భక్తితో బోనాలు తయారుచేసి నైవేద్యాన్ని నివేదించారు. బస చేసిన ప్రాంతంలో, ఆలయ గంగరేగు చెట్టు ప్రాంగణంలో, ముఖమండపంలో మల్లన్నకు చిలుకపట్నం, నజరు, ముఖ మండప పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని చీర, సారెలతో ఒడిబియ్యాలు పోశారు. కోరికలు నేరవేర్చమని గంగరేగు చెట్టుకు ముడుపు కట్టారు. సంతానం కోసం మహిళలు వ ల్లుబండ వద్ద వరం పట్టారు. 


ఎల్లమ్మకు బోనాలు

మల్లన్న సహోదరి ఎల్లమ్మకు కూడా భక్తులు బోనాలు నివేదించారు. డప్పుల చప్పుడుతో బోనాలు ఎత్తుకుని సిగాలు ఊగుతూ ఎల్లమ్మ గుట్టపైకి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. బెల్లంపానకం, కల్లు నైవేద్యం సమర్పించి చల్లంగా చూడమని వేడుకున్నారు. 


క్యూలైన్లలో పడిగాపులు

మల్లన్న దర్శనానికి లక్ష మంది భక్తులు తరలిరావడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాశారు. ఈవో బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి, ధర్మకర్తలు ఉట్కూరి అమర్‌, బొంగు నాగిరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్‌ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. హుస్నాబాద్‌ ఏసీపీ వాసాల సతీశ్‌, చేర్యాల సీఐ భీంరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో 250 మంది పోలీసుతో బందోబస్తు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి చిరుజల్లులు పడటంతో భక్తులు ఇబ్బందులుపడ్డారు. భక్తుల కోసం పార్కింగ్‌ నుంచి ఆలయం వరకు ఉచిత వాహనాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ ఎక్కడా కానరాలేదు. 

Updated Date - 2022-01-17T05:02:47+05:30 IST