కొండా.. మహా దమ్మున్న మగాడు
ABN , First Publish Date - 2021-10-13T08:07:59+05:30 IST
‘మహా దమ్మున్న మగాడు కొండా మురళీధర్ రావు’.. అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కొనియాడారు.
ఈ బయోపిక్ ‘శివ’ను దాటిపోతుంది: ఆర్జీవీ
మా జీవితకథ భిన్నమైనది కాబట్టే సినిమా తీస్తున్నారు : కొండా సురేఖ
గీసుగొండ, అక్టోబరు 12: ‘మహా దమ్మున్న మగాడు కొండా మురళీధర్ రావు’.. అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కొనియాడారు. సురేఖ వెంట మురళీధర్రావు పడినట్లుగా.. కొండా బయోపిక్ తీయడానికి తాను ఆయన వెంట చాలా తిరగాల్సి వచ్చిందని వర్మ పేర్కొన్నారు. కొండా మురళి-సురేఖ జీవిత ఘటనల ఆధారంగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘కొండా’ సినిమా షూటింగ్ మంగళవారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని వంచనగిరిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన వర్మ.. సినిమా కొండా మురళికి పాజిటివ్గా ఉంటుందా లేక నెగెటివ్గా ఉంటుందా అని చాలా మంది పెద్దలు తనను అడిగారని, ‘సినిమాలో నిజాన్ని మీ ముందు ఉంచుతా మీరే పాజిటివో నెగెటివో చెప్పాలి’ అని తాను వారికి బదులిచ్చానని వెల్లడించారు. ఈ సినిమా తన ‘శివ’ చిత్రాన్ని దాటిపోతుందని, తన సినిమా జీవితంలో ఒక చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. ఇక, ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించిన కొండా సురేఖ.. తమ జీవిత కథ ఎంతో భిన్నమైనదని, అందుకే రాంగోపాల్వర్మ సినిమా తీయడానికి ముందుకువచ్చారని అన్నారు.
‘సినిమాలో ఎలా చూపించినా మీ ఇష్టం’ అంటూ మురళీధర్రావు చేతిని ఆమె ఆర్జీవీ చేతికి అందించారు. ప్రజల, దేవతల దీవెనలు తమకు ఎప్పుడూ ఉంటాయని కొండా మురళి అన్నారు. కాగా.. కొండా సురేఖ తన ప్రసంగంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఒక తల్లి, తండ్రికి పుట్టిన నేను టీడీపీని వీడను’ ..అని ప్రగల్భాలు పలికిన ఎర్రబెల్లి టీడీపీ నుంచి టీఆర్ఎ్సలోకి మారారని మండిపడ్డారు. షూటింగ్ ప్రారంభానికి ముందు ర్యాలీ నిర్వహించారు. కాగా, తనకు దేవుడంటే నమ్మకం లేదని పదేపదే చెప్పే రాంగోపాల్ వర్మ.. గీసుకొండ మండలంలోని కోటమైసమ్మ తల్లికి విస్కీ నైవేద్యంగా సమర్పించారు. ‘కొండా’ బయోపిక్ షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా వర్మ ఆ ఆలయానికి వెళ్లారు.