కొండపల్లిలో హైడ్రామా

ABN , First Publish Date - 2021-11-19T01:11:08+05:30 IST

కొండపల్లి మున్సిపాలిటీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఈ నెల 22న చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా

కొండపల్లిలో హైడ్రామా

విజయవాడ: కొండపల్లి మున్సిపాలిటీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఈ నెల 22న చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తనకు ఓటు హక్కు కల్పించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని కోరారు. మున్సిపల్‌ కమిషనర్‌కు లేఖ రాసినా స్పందన లేకపోవడంతో కేశినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాల్సిన మున్సిపల్‌ కమిషనర్‌.. ఇప్పటివరకు సమాధానం ఇవ్వకపోవడంతో కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని కేశినేని నిర్ణయం తీసుకున్నారు. కొండపల్లిలో టీడీపీకి ఒక ఓటు అదనంగా మెజారిటీ ఉంది. కమిషనర్‌ కాలయాపన చేస్తున్నారంటూ టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ నడుమ హోరాహోరీ పోరు సాగింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇక్కడ వైసీపీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఇక్కడ డబ్బు, మద్యం ఏరులై పారింది. చివరి నిమిషం వరకు అధికార పార్టీ నాయకులు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మొత్తం 29 వార్డులు ఉండగా టీడీపీకి 14.. వైసీపీకి 14 వార్డులు దక్కాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థిని కరిమికొండ శ్రీలక్ష్మి గెలుపొందారు. అయితే టీడీపీ నేతల ఆహ్వానం మేరకు ఆమె చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కు చేరింది. వైసీపీ తరఫున మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇక్కడ ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకున్నా, ఎంపీ కేశినేని నాని టీడీపీ తరఫున ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది.

Updated Date - 2021-11-19T01:11:08+05:30 IST