చకచకా కోటిపల్లి రైల్వే పనులు

ABN , First Publish Date - 2021-06-22T07:19:06+05:30 IST

కోటిపల్లి రైల్వే లైన్‌ పనులు వేగవంతమయ్యాయి.

చకచకా కోటిపల్లి రైల్వే పనులు

60 శాతం పూర్తయిన వంతెనలు

నరసాపురం, జూన్‌ 21 : కోటిపల్లి రైల్వే లైన్‌ పనులు వేగవంతమయ్యాయి. 57 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ప్రాజెక్టులో మూడుచోట్ల వంతెనలు కీలకం. గోదావరిలో నిర్మిస్తున్న వంతెన పనులు 60 శాతం పూర్తయ్యాయి. నరసాపురం నుంచి కోటిపల్లి వరకు నిర్మించే ఈ కొత్తలైన్‌ వల్ల కోనసీమకు రైల్వేమార్గం ఏర్పడుతుంది. 2014లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. రూ.2,200 కోట్లు అంచనాలతో ప్రాజెక్టు ప్రారంభించారు. రెండు జిల్లాల్లో ఇప్పటికే భూసేకరణ పూర్తయ్యాయి. ట్రాక్‌ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ముందుగా జిల్లాలోని చించినాడ తూర్పు గోదావరి దిండి మధ్య వంతెన పనులు మొదలుపెట్టారు. 20 ఫిల్లర్లుగాను ఇప్పటి వరకు 18 ఫిల్లర్ల పనులు ఊపందుకున్నాయి. 55 మీటర్ల ఎత్తు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే ప్రారంభించిన 18 ఫిల్లర్లు భూ అడుగుభాగం నుంచి 40 మీటర్లు ఎత్తు వచ్చాయి. ఇంకా 15 మీటర్ల ఎత్తు లేస్తే.. వంతెన పైన పనులు చేపట్టవచ్చు. ఇక అతి పెద్ద వంతెన ముక్తేశ్వరం, కోటిపల్లి మధ్య నిర్మిస్తున్నారు. 43 మీటర్లుగాను ఇప్పటికే అన్ని ఫిల్లర్లు 50 మీటర్ల ఎత్తు వచ్చాయి. ఇంకా పది మీటర్ల ఎత్తు వస్తే.. వంతెనపై పనులు చేపట్టవచ్చు. మూడోది పాశర్లపూడి, బోడసుక్రు మధ్య గోదావరిలో 20 ఫిల్లర్‌ పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 11 ఫిల్లర్లను 40 మీటర్ల మేర భూమిలో నుంచి పైకి తీసుకొచ్చారు. ఇంకా 15 మీటర్ల ఎత్తు రావాల్సి ఉంది. ఇది కాకుండా మరో పది ఫిల్లర్ల పనులు ప్రారంభించాలి. నిధులు పుష్కలంగా ఉంటే.. ఈ మూడు వంతెనలను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పనులు పూర్తికాగానే ట్రాక్‌ పనులు ప్రారంభించాలన్నది లక్ష్యం. 


Updated Date - 2021-06-22T07:19:06+05:30 IST