సింగరేణిపై కొవిడ్ పంజా
ABN , First Publish Date - 2020-08-12T10:12:54+05:30 IST
ఉమ్మడి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంపై పంజా విసిరింది. మంగళవారం ఒక్కరోజే ఇరుజిల్లాల్లోని సింగరేణి ఏరియా
ఉమ్మడి జిల్లా ఏరియాల్లో 137మందికి పాజిటివ్
నిర్ధారణ పరీక్షల ప్రారంభం రోజునే రికార్డుస్థాయిలో నమోదు
భయంతో బిక్కుబిక్కుమంటున్న సింగరేణియులు
ఇరు జిల్లాల్లో మొత్తం 287 మందికి లక్షణాలు
(ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం నెట్వర్క్)
ఉమ్మడి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంపై పంజా విసిరింది. మంగళవారం ఒక్కరోజే ఇరుజిల్లాల్లోని సింగరేణి ఏరియాల్లో 137 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సింగరేణి ఆధ్వర్యంలో అన్ని ఆసుపత్రుల్లో మంగళవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. తొలిరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవడంతో అటు అధికారులు, ఇటు కార్మికులు, వారి కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి.
కొత్తగూడెం ఏరియాలో 59, మణుగూరు ఏరియాలో 18, ఇల్లెందు ఏరియాలో నాలుగు, కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ పరిధిలో 28కేసులు, సత్తుపల్లి ఏరియాలో 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో మరో 150మందికి కరోనా లక్షణాలున్నట్టు నిర్ధారణైంది. ఖమ్మం జిల్లాలో 72మందికి, భద్రాద్రి జిల్లా లో 78 మంది కరోనా బారిన పడ్డారు. కల్లూరు మండలంలో ఒకరు, నేలకొండపల్లిలో ఒకరు, పాల్వంచ మండలంలో ఒకరు మృతిచెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఎనిమిది మందికి, కామేపల్లి మండలంలో నలుగురికి, సత్తుపల్లిలో ముగ్గురికి, కొణిజర్లలో ఒకరికి, ఎర్రుపాలెం మండలంలో ఒకరికి, కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో 20 మందికి, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 25మందికి, చర్లలో ఒకరికి, అశ్వాపురంలో ఐదుగురికి, ఇల్లెందులో ఐదుగురికి, టేకులపల్లిలో ఇద్దరికి, అశ్వారావుపేటలో ఐదుదగురికి, సుజాతనగర్లో ఎనిమిది మందికి, దుమ్ముగూడెంలో ఒకరికి, గుండాలలో ఒకరికి, మణుగూరులో ఆరుగురికి పాజిటివ్ నిర్ధారణైంది.
జూలూరుపాడు, కరకగూడెం, పినపాక, ఆళ్లపల్లిలోని పీహెచ్సీలో వైద్య పరీక్షలు నిర్వహించలేదు. బూర్గంపాడులో నిర్ధారణ పరీక్షలు చేసినా ఎలాంటి కేసులు నమోదవలేదు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందినట్టు తెలిసింది. సదరు వ్యక్తికి వారంరోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణవగా హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. ఇక పాల్వంచ మండలం నారాయణరావుపేటకు చెందిన ఓ వ్యక్తి (38) మంగళవారం రాత్రి కరోనాతో చికిత్స కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. నేలకొండపల్లికి చెందిన ఓ వ్యాపారి కూడా కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు అంత్యక్రియల నిర్వహణ కోసం పాల్వంచ విశాల సహకార పరపతి సంఘం ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ను సంప్రదించగా..
ఆయన, ఆయన మిత్ర బృందం సదరు వ్యక్తి అంత్యక్రియలను మంగళవారం రాత్రి హిందూ శ్మశానవాటికలో పూర్తి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.