కరోనాపై రెండో రోజూ స్టాలిన్ సమీక్ష
ABN , First Publish Date - 2021-05-05T13:16:08+05:30 IST
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మంగళవారం కూడా కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, మందులు, ఆక్సిజన్ నిల్వలపై ఆరా తీశారు. వీటికి సంబంధించిన పూర్తి
- తక్షణ చర్యలకు ఆదేశం
చెన్నై: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మంగళవారం కూడా కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, మందులు, ఆక్సిజన్ నిల్వలపై ఆరా తీశారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తనముందుంచాలని ఆయన ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే, మందులు, ఆక్సిజన్ నిల్వలపై నిరంతరం అప్రమత్తంగా వుండాలని స్పష్టం చేశారు. కాగా, ఈనెల రెండో తేదీన వెల్లడైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో స్టాలిన్ ఈనెల 7వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు నుంచే రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే, రెండో రోజైన మంగళవారం కూడా ఈ సమీక్ష జరిగింది. ఆర్యోగ శాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్, ఆర్థిక శాఖ కార్యదర్శి కృష్ణన్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు అతుల్యా మిశ్రా, ఫణీంద్రరెడ్డి, డీజీపీ త్రిపాఠి, చెన్నై నగర పోలీస్ కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ తదితరులు స్థానిక ఆళ్వార్పేటలోని స్టాలిన్ నివాసంలో జరిగిన సమీక్షకు హాజరయ్యారు. వీరితో దాదాపు అర్థగంటలపాటు స్టాలిన్ వివిధ అంశాలపై చర్చించారు. అలాగే తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకుని, తీసుకోవాల్సిన వాటిపై కొన్ని సూచనలను చేశారు. అలాగే, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేం దుకు ఎలాంటి ఆంక్షలు విధించాలన్న అంశంపై కూడా ఆయన ఆరా తీశారు. అలాగే, ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ నిల్వలు, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది తదితర అంశాల్లో తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫ్రంట్లైన్ వర్కర్లుగా జర్నలిస్టులు
కరోనా వైరస్ మహమ్మారి కష్టకాలంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వార్తలను సేకరిస్తున్న జర్నలిస్టులను కోవిడ్ ఫ్రంట్లైన్ వర్కర్లుగా రాష్ట్రానికి కాబోయే కొత్తముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంతో ఫ్రంట్లైన్ వర్కర్లకు లభించే అన్ని సౌకర్యాలు జర్నలిస్టులకు లభించనున్నాయి. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా పరిగణించే మీడియాలో పనిచేసే పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారని, వీరిని రాష్ట్ర ప్రభుత్వం ఫ్రంట్లైన్ వర్కర్లుగా ఇకపై పరిగణిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.