కొవిడ్‌ టీకా సంజీవనితో సమానం

ABN , First Publish Date - 2021-01-17T07:28:47+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరాటంలో కొవిడ్‌ టీకాలను సంజీవనిగా కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అభివర్ణించారు. కొవిడ్‌ వ్యాక్సిన్లు సురక్షితమని,

కొవిడ్‌ టీకా సంజీవనితో సమానం

వ్యాక్సిన్లు సురక్షితం, వదంతులను నమ్మొద్దు

ప్రజలకు కేంద్ర మంత్రి  హర్షవర్ధన్‌ విజ్ఞప్తి


న్యూఢిల్లీ, జనవరి 16: కరోనా మహమ్మారిపై పోరాటంలో కొవిడ్‌ టీకాలను సంజీవనిగా కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అభివర్ణించారు. కొవిడ్‌ వ్యాక్సిన్లు సురక్షితమని, వదంతులను నమ్మవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం నిరంతరం అంకితభావంతో శ్రమించిన శాస్త్రవేత్తలు, నిపుణుల మాటలపై విశ్వాసం ఉంచాలని కోరారు. శనివారం అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థలో (ఎయిమ్స్‌) మీడియాతో ఆయన మాట్లాడారు.


‘‘గతంలో పోలియో, మశూచి వంటి మహమ్మారులపై విజయం సాధించాం. ఇపుడు కరోనాపైనా గెలిచే దశకు చేరుకున్నాం. కష్టకాలంలో ముందు వరసలో నిల్చుని ఈ మహమ్మారిపై పోరాడిన వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, జర్నలిస్టులకు మళ్లీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని మంత్రి పేర్కొన్నారు. అలాగే వ్యాక్సిన్‌ గురించి మీడియా సరైన సమాచారాన్నే ప్రజలకు చేరువేస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.


భారత్‌ను స్వావలంబన గల దేశంగా తీర్చిదిద్దాలన్న దేశ దృఢనిశ్చయాన్ని, శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాన్ని, నాయకత్వ శక్తిని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చాటిచెప్పిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని దేశం.. విపత్తులను కూడా అవకాశాలుగా, సవాళ్లను కూడా విజయాలుగా మార్చగల దేశమని ఆయన కొనియాడారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం దేశ చరిత్రలోనే మహత్వపూర్ణమైన రోజని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.


దేశీయంగా అభివృద్ధి చేసిన టీకాలను ఎగుమతి చేసే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ తెలిపారు. కాగా టీకా కార్యక్రమం నేపథ్యంలో వ్యాక్సిన్ల అత్యవసర వినియోగంపై కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ మరోసారి సందేహం వ్యక్తం చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాక్సిన్‌ టీకాకు సరైన ప్రక్రియ లేకుండానే అనుమతి ఇచ్చారని ఆయన ఆరోపించారు. 


Updated Date - 2021-01-17T07:28:47+05:30 IST