నల్గొండ ప్రభుత్వాసుపత్రిలోని కోవిడ్ వార్డులో దారుణం
ABN , First Publish Date - 2020-07-29T21:27:12+05:30 IST
నల్గొండ ప్రభుత్వాసుపత్రిలోని కోవిడ్ వార్డులో దారుణం
నల్గొండ: ప్రభుత్వ ఆసుపత్రుల తీరు మారడం లేదు. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీర్చమని ప్రభుత్వాలను మొరపెట్టుకున్నప్పటీకీ గాలికి వదిలేస్తున్నారు. అటు ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇటు వైద్యుల అలసత్వంతో ప్రజలు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. నల్గొండ ప్రభుత్వాసుపత్రిలోని కోవిడ్ వార్డులో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా పేషేంట్లకు వారి సహాయకులే మాస్కులు, గ్లౌజులు లేకుండా ప్రాణాలకు తెగించి సేవలు చేస్తున్నారు. కోవిడ్ వార్డులో డాక్టర్లు, సిబ్బంది కొరత రోగులను వెంటాడుతోంది. కరోనా పేషంట్స్ సహాయకులపై ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుల దాడులకు దిగుతున్నారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతోనే రోగులకు సేవలు చేస్తున్నామని సహాయకులు చెబుతున్నారు.
కరోనా లక్షణాలతో నల్గొండ జిల్లా ఆస్పత్రిలో చేరిన సల్కునూరు గ్రామానికి చెందిన యువకుడిని వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో తల్లి ఎదుటే అతడు కన్నుమూశాడు. కొడుకు మృతదేహం మీద పడి ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చింది. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టిచింది. నల్లగొండ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్పై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ అందక ఓ కొవిడ్ పేషెంట్ మృతి చెందిన ఘటనపై బాధ్యతారహితంగా మాట్లాడిన సూపరింటెండెంట్కు కౌన్సెలింగ్ ఇవ్వాలని నల్లగొండ కలెక్టర్ను ఆదేశించింది.