రైల్వే స్లీపర్ బోగీల్లో ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు
ABN , First Publish Date - 2020-04-02T09:07:43+05:30 IST
కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు..
గుంటూరు(ఆంధ్రజ్యోతి): కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన సంసిద్ధతల్లో భాగస్వామ్యం అయ్యేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసేందుకు వీలుగా రైళ్లలో స్లీపర్క్లాస్ బోగీలను క్వారంటైన్, ఐసోలేషన్ కోచ్లుగా మార్పుచేస్తోన్నది. రైల్వేబోర్డు నుంచి అందిన ఆదేశాల మేరకు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు తమ వద్ద అందుబాటులో ఉన్న ఎనిమిది అదనపు స్లీపర్ క్లాస్ బోగీలను ఐసోలేషన్ వార్డులుగా రూపొందిస్తున్నారు. డొంకరోడ్డు మూడొంతెనలకు సమీపంలోని రైల్వే కోచ్ మెయిన్టెనెన్స్ డిపోలో శరవేగంగా వీటిని సిద్ధం చేస్తున్నారు. త్వరితగతిన పూర్తిచేసి దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగానికి వాటిని తాత్కాలికంగా స్వాధీనపరుస్తారు.
రైల్వే స్లీపర్క్లాస్ బోగీలో మొత్తం 72 బెర్తులుంటాయి. ఇవి 9 క్యాబిన్లలో ఏర్పాటయి ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతీ బోగీలో అటువైపు చివర, ఇటువైపు చివర (1, 9) క్యాబిన్లను ఐసోలేషన్గా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం సైడ్ బెర్తులతో పాటు అప్పర్, మిడిల్ బెర్తులు తొలగిస్తున్నారు. దాంతో రెండు క్యాబిన్లు అందుబాటులోకి వస్తాయి. వాటిని సగం పార్టీషన్ షీట్, సగం కర్టెన్, మరో దాంట్లో రెండు పూర్తి ప్లాస్టిక్ కర్టెన్లు ఏర్పాటు చేస్తున్నారు. రెండు క్యాబిన్లలో కరోనా వైరస్ సోకిన/అనుమానిత రోగి నిద్రించేందుకు వీలుగా లోయర్ బెర్తు వెడల్పు 90 మిల్లీమీటర్లకు పెంచుతున్నారు. ఒక క్యాబిన్కు వినైల్ ప్యానల్స్ కూడా అమర్చుతున్నారు. వెంటిలేషన్ షట్టర్ల నుంచి దోమలు రాకుండా ఉండేందుకు వైర్మెష్ ఏర్పాటుచేస్తారు. అప్పర్ బెర్తు ఎక్కేందుకు ఏర్పాటు చేసిన నిచ్చెన తొలగిస్తారు. రెండు స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ హోల్డర్లు అమర్చారు. విద్యుత్ సరఫరాకు 5 ఏఎంపీల సామర్థ్యం గల మూడు సాకెట్లను ఏర్పాటు చేస్తున్నారు. క్యాబిన్ ద్వారంలో రెండు సగాల కర్టెన్ ఏర్పాటుచేస్తారు.
టాయిలెట్లోనూ మార్పులు
బోగి చివరన దేశీయ పద్ధతిలో ఉన్న టాయిలెట్ ప్యాన్లను తొలగిస్తారు. దానిని స్నానాలగదిగా మార్చి ఫ్లోరింగ్ అంతా పీవీసీతో అద్ది మురుగునీరు పోయేందుకు మార్గం ఏర్పాటుచేస్తారు. టాయిలెట్ లోపల ఉన్న వాష్బేసిన్ తీసివేయడంతో స్నాన సౌకర్యం మరింత మెరగవుతుంది. తగినంత ఎత్తుతో లిఫ్టు టైప్ హ్యాండిల్ కలిగిన అదనపు పంపు ఏర్పాటుతో బకెట్లో నీళ్లు నింపడం సులభతరం అవుతుంది. ఆరోగ్యకరంగా వాడుకొనేందుకు షవర్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. బకెట్, బాత్స్టూల్, మగ్ కొత్తవి సమకూర్చుతారు. ఈ విధంగా తయారుచేసిన ఐసోలేషన్ బెడ్స్తో కూడిన బోగీని జిల్లా యంత్రాంగానికి అందజేస్తారు.