కొవిడ్ సోకిన తల్లిదండ్రుల పిల్లలకు సంరక్షణ : కలెక్టర్
ABN , First Publish Date - 2021-05-11T14:59:00+05:30 IST
తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకి..
విజయవాడ: తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నా, హోం క్వారంటైన్లో ఉన్నా వారి పిల్లలను కృష్ణాజిల్లా చైల్డ్లైన్ సొసైటీ ద్వారా తాత్కాలిక సంరక్షణ అందిస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఇందుకు సంబంఽధించిన పోస్టర్ను తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల తాత్కాలిక సంరక్షణకు జిల్లా నోడల్ అధికారి కె.భాస్కర్రావు ఆధ్వర్యంలో నాలుగు కేంద్రాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. విజయవాడ.. ఆటోనగర్లోని మ్యాంగో చిల్డ్రన్ హోంఫర్ బాలురు (అర్జున్, 78938 53344) ఆగిరిపల్లిలోని హీల్పేరడైజ్ చిల్డ్రన్ హోం (లక్ష్మీ, 98492 19194), మచిలీపట్నంలోని బెర్చ చిల్డ్రన్ హోంఫర్ బాలురు (రామిరెడ్డి, 91107 12838), బెర్చ చిల్డ్రన్ హోంఫర్ బాలికలు (సత్యవతి, 92909 35000) ఈ కేంద్రాల్లో పిల్లల సంరక్షణ బాధ్యతలు చేపపడుతున్నామన్నారు. వైరస్ నుంచి వారి తల్లిదండ్రులు కొలుకున్నాక పిల్లలను తిరిగి అప్పగిస్తామన్నారు. బాఽధితులు మరణిస్తే సంరక్షణ కేంద్రాల్లోనే ఉంచి పూర్తి బాధ్యత చేపడతామన్నారు. అలాగే అనాథ బాలలకు పునరావాసం కల్పిస్తున్నామన్నారు. ఇటువంటి పిల్లల సమాచారాన్ని 181, 1098 టోల్ఫ్రీ నంబర్కు ఇవ్వాలని చైల్డ్లైన్ నిర్వాహకుడు అరవ రమేష్ తెలిపారు. జిల్లా నోడల్ అధికారి భాస్కర్రావు (91000 45423)కు కూడా సమాచారం ఇవ్వవచ్చన్నారు.
జిల్లాలో 6.6లక్షల మందికిపైగా వ్యాక్సిన్
జిల్లాలో ఇప్పటివరకు 6,66,329 మందికి వ్యాక్సిన్ వేశామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, స్పెషల్ సీఎస్ కె.ఎస్ జవహర్రెడ్డి కొవిడ్ నియంత్రణపై జిల్లా టీంతో సోమవారం జూమ్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్ పరిస్థితులు, టెస్టులు, వ్యాక్సినేషన్, బెడ్స్, ఆక్సిజన్ గురించి వివరించారు. 76 కొవిడ్ ఆసుపత్రుల్లో 4,394 బెడ్స్ ద్వారా చికిత్స పొందుతున్నారన్నారు. ఇంకా 291 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఏప్రిల్ 28 నుంచి నేటివరకు హోమ్ ఐసోలేషన్లో ఉన్న 4245 మందికి ఉచితంగా కిట్స్ పంపిణీ చేశామన్నారు. రెడ్, గ్రీన్, బ్ల్యూ కేటగిరిలుగా ప్రజలను గుర్తించి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్టు వివరించారు. జేసీ ఎల్.శివశంకర్ మాట్లాడుతూ రెండు, మూడు రోజులుగా ఆక్సిజన్ ఫ్లాంట్లను తనిఖీ చేస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం పరిధిలో 12.7 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామన్నారు. డీఎంహెచ్వో ఎం.సుహాసిని, డీఎల్వో ఉషారాణి, డీసీహెచ్ఎస్ జ్యోతిర్మణి, డిప్యూటీ డీఎంహెచ్వో ఇందుమతి, డాక్టర్ నవీన్ పాల్గొన్నారు.