కృష్ణాజిల్లా: సీఐ అనుచిత వ్యాఖ్యలతో దంపతుల ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-11-22T17:37:19+05:30 IST
సీఐ దుర్గారావు అనుచిత వ్యాఖ్యలతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.
కృష్ణాజిల్లా: గుడివాడ టూ టౌన్ సీఐ దుర్గారావు అనుచిత వ్యాఖ్యలతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబానికి సంబంధించిన విషయంపై దంపతులు మురళి, రాణి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. వారితో సీఐ అనుచితంగా మాట్లాడారు. తమ కుమారుడు మరణించడంతో, ఇరవై రోజుల క్రితం జన్మించిన మనుమడని చూపించాలంటు కోడలిని కోరగా ఆమె పట్టించుకోలేదని, తమ మనుమడిని చూపించాలంటూ పోలీస్ స్టేషన్లో నాలుగు రోజులుగా ఫిర్యాదు చేసేందుకు ఆ దంపతులు తిరుగుతున్నారు.
దంపతులు మురళి, రాణి మాట్లాడుతూ కోడలి కుటుంబసభ్యులతో సీఐ దుర్గారావు మంతనాలు జరిపారని, ఇదేమిటని ప్రశ్నించిన తమను, చస్తే చావండి.. కేసు నమోదు చేయనని అగ్రహం వ్యక్తం చేశారని వాపోయారు. సీఐ వ్యాఖ్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించామన్నారు. కుమారుడు మరణించిన బాధలో ఉన్న తమకు, మనుమడిని చూపించాలంటూ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.