కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే మేమెందుకు వ్యతిరేకిస్తాం: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-01-27T22:58:47+05:30 IST
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తామెందుకు వ్యతిరేకిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ను ఎవరు గౌరవించినా తాము
అమరావతి: కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తామెందుకు వ్యతిరేకిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ను ఎవరు గౌరవించినా తాము స్వాగతిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతానికి చెందిన నేత కాదని, ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ తొలగించారని విమర్శించారు. కడప జిల్లాకు వైఎస్ పేరు పెట్టినా తాము వ్యతిరేకించలేదని గుర్తుచేశారు. టీడీపీకి ద్వంద్వ విధానాలు ఉండవని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని తప్పుబట్టారు. ఎన్టీఆర్ స్మృతి వనం ప్రాజెక్ట్ను నిలిపివేసిన జగన్రెడ్డి ప్రభుత్వం.. ఎన్టీఆర్పై ప్రేముందని చెప్పే ప్రయత్నాన్ని ప్రజలు నమ్మరని తెలిపారు.
‘‘అన్నా క్యాంటీన్లను జగన్రెడ్డి నిలిపివేయడం నిజం కాదా? కొత్త జిల్లాల నిర్ణయంపై వైసీపీలోనే వ్యతిరేకత వస్తోంది. తొందరపాటు నిర్ణయాలతో ఇప్పటికే ఏపీకి జగన్రెడ్డి తీవ్రనష్టం చేశారు. అశాస్త్రీయంగా చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుతో.. ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి వస్తుంది. కనీసం కేబినెట్లో కూడా సమగ్రంగా చర్చించకుండా.. రాత్రికి రాత్రి నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరమేంటి?. రాజధానుల తరలింపు, జిల్లాల ఏర్పాటు వంటి కీలక అంశాలపైనా.. రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. గుడివాడ క్యాసినో వ్యవహారంపై పోరాటం కొనసాగిస్తాం’’ అని చంద్రబాబు ప్రకటించారు.