కృష్ణా బోర్డులో కదలిక!
ABN , First Publish Date - 2021-10-23T08:21:31+05:30 IST
కేంద్రం ఆదేశాలతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కదిలింది. గెజిట్ అమలులో తదుపరి కార్యాచరణ దిశగా ముందుకెళ్లాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడంతో ప్రాజెక్టుల స్వాధీనానికి ఉన్న ప్రతిబంధకాలు తొలగించే దిశగా బోర్డు ..
- 25, 26 తేదీల్లో శ్రీశైలంలో అధికారుల పర్యటన
- ప్రతిబంధకాలను తొలగించే ప్రయత్నంలో బోర్డు
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ఆదేశాలతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కదిలింది. గెజిట్ అమలులో తదుపరి కార్యాచరణ దిశగా ముందుకెళ్లాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడంతో ప్రాజెక్టుల స్వాధీనానికి ఉన్న ప్రతిబంధకాలు తొలగించే దిశగా బోర్డు అడుగులు వేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులతో పాటే తమ ప్రాజెక్టులను ఏకకాలంలో బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ మెలిక పెట్టింది. బచావత్ ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారమే శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నిర్వహణ విధివిధానాలను అమలు చేస్తామని స్పష్టం చేస్తేనే ప్రాజెక్టులు అప్పగిస్తామని తెలంగాణ పట్టుబడుతోంది. ఆయా అంశాలపై అధ్యయనం, ప్రాజెక్టుల స్వాధీనంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి వీలుగా ఈ నెల 25, 26వ తేదీల్లో శ్రీశైలం ప్రాజెక్టులోని ఆరు నీటి విడుదల వ్యవస్థలను పరిశీలించడానికి రవి కుమార్ పిళ్లై నేతృత్వంలోని కృష్ణా బోర్డు అధికారుల బృందం క్షేత్ర పర్యటనకు వెళ్లనుంది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదు జలవిద్యుత్కేంద్రాలతో పాటు రెండు ఆనకట్టలు, ఇతర కాలువలు కలుపుకొని మొత్తం 15 నీటి విడుదల వ్యవస్థలను తమ చేతికి అందించాలని కోరుతూ కృష్ణా బోర్డు తీర్మానం చేసింది. బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకెళుతూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పట్ల తెలంగాణ నారాజ్గా ఉండగా... ఏపీ మాత్రం స్వాగతిస్తోంది. ప్రాజెక్టులను నేరుగా స్వాధీనం చేసుకొనే అధికారం బోర్డులకు లేదు. తెలుగు రాష్ట్రాలు వాటిని బోర్డు చేతికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. ఉద్యోగులను, నిధులను ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాల సమ్మతితోనే ప్రాజెక్టులను తీసుకోవాలని బోర్డు యోచిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందే జలవిద్యుత్ కోసమని, మరేతర అవసరాలకు ఈ నీటిని మళ్లించడానికి వీల్లేదని బచావత్ ట్రైబ్యునల్ పేర్కొంది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పును తెలంగాణ నమ్ముకోగా... కృష్ణా బోర్డుపై ఏపీ ఆశలు పెట్టుకుంది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పును ప్రామాణికంగా చేసుకుంటే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల నుంచి 34 టీఎంసీలకు మించి తరలించే అవకాశాల్లేవు. అదే జరిగితే రాయలసీమపై ఆ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. వాస్తవానికి కేఆర్ఎంబీ కూడా బచావత్ ట్రైబ్యునల్ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. బచావత్ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టుపై నిర్ణయాలు ఉంటాయని కేఆర్ఎంబీ పూచీకత్తు ఇస్తేనే తెలంగాణ తమ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకెళ్లే అంశాన్ని పరిశీలించనుంది. ఈ క్రమంలో ఈ నెల 25, 26వ తేదీల్లో ఉపసంఘం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.