ఇక తగినంత ప్రాణవాయువు
ABN , First Publish Date - 2021-06-12T05:07:59+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ బాధితుల అవసరాల నిమిత్తం హైదరాబాదుకు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెట్ సంస్థ మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం కలెక్టర్ చక్రధర్బాబుకు అందజేసింది.
3 క్రయోజనిక్ ట్యాంకర్లను అందజేసిన మేఘా సంస్థ
ముత్తుకూరు, జూన్ 11 : రాష్ట్రంలో కొవిడ్ బాధితుల అవసరాల నిమిత్తం హైదరాబాదుకు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెట్ సంస్థ మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం కలెక్టర్ చక్రధర్బాబుకు అందజేసింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పశ్చిమబెంగాల్ పనాగడ్ వైమానిక స్థావరానికి ప్రత్యేక విమానంలో సింగపూర్ నుంచి ట్యాంకర్లు చేరుకున్నాయన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్ వద్ద ఆక్సిజన్ నింపుకున్న ట్యాంకర్లు ప్రత్యేక రైలులో పోర్టుకు చేరుకున్నట్లు తెలిపారు. మేఘా అందించిన ఈ మూడు ట్యాంకర్లను పోర్టు నుంచి నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు పంపుతామన్నారు. అంతకముందు మేఘా సంస్థ ప్రతినిధి రాజ్కుమార్ మూడు ట్యాంకర్లను కలెక్టర్కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో ట్యాంకర్లో 1.4కోట్ల లీటర్ల ఆక్సిజన్ సామర్థ్యం కలిగి ఉందన్నారు. ప్రస్తుతం అందించిన మూడు ట్యాంకర్లతో రూ.1.65కోట్ల విలువ కలిగిన 4.2 కోట్ల లీటర్ల ఆక్సిజన్ అందించామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీలు బాపిరెడ్డి, హరేందిర ప్రసాద్, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, మేఘా సంస్థ ప్రతినిధులు చిరంజీవి, అసోసియేట్ మేనెజర్ శర్మ, ఓఅండ్ఎం ఇన్చార్జి రామకృష్ణ , పోర్టు ప్రతినిధులు పాల్గొన్నారు.