కొవిడ్తో అనాథలైన పిల్లలను అక్కున చేర్చుకుంటాం
ABN , First Publish Date - 2021-05-07T10:09:00+05:30 IST
కరోనా కారణంగా తల్లిదండ్రులను పొగొట్టుకున్న పిల్లలను చేరదీసి వారికి జువైనల్ జస్టిస్ ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా
మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా తల్లిదండ్రులను పొగొట్టుకున్న పిల్లలను చేరదీసి వారికి జువైనల్ జస్టిస్ ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం 181, 1098 (చైల్డ్లైన్) టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అలాగే తల్లిదండ్రులు ఇద్దరూ కరోనా వ్యాధి కారణంగా ఆసుపత్రుల్లో చేరి వారి పిల్లలను ఎవరూ పట్టించుకోని సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఇలాంటి పిల్లలకు కూడా బాలల సంరక్షణ కేంద్రాల్లో వారి తల్లిదండ్రులు కోలుకునేంత వరకు తాత్కాలిక రక్షణ కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సంబంధిత జిల్లా యంత్రాంగం ద్వారా ఈ పిల్లలకు సేవలందించేందుకు జిల్లా కలెక్టర్లను కోరామన్నారు. ఈ హెల్ప్లైన్ నంబర్లుపై, కార్యక్రమంపై సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారమయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లను కృతిక కోరారు.