కొనసాగుతున్న వరద ఉధృతి
ABN , First Publish Date - 2021-07-31T05:22:07+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి శుక్రవారం కూడా కొనసాగింది. శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరడంతో ఒక్క రోజులోనే 13 అడుగుల మేర నీరు ప్రాజెక్ట్కు వచ్చి చేరింది.
విజయపురిసౌత, జూలై 30: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి శుక్రవారం కూడా కొనసాగింది. శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరడంతో ఒక్క రోజులోనే 13 అడుగుల మేర నీరు ప్రాజెక్ట్కు వచ్చి చేరింది. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 560.10 అడుగులు ఉంది. ఇది 232.61 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీ ద్వారా 1,100 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత కేంద్రం ద్వారా 34,138 క్యూసెక్కులు, మొత్తం ఔట్ఫ్లోగా 35,238 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇనఫ్లో వాటర్గా 4,24,071 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.10 అడుగులుంది. ఇది 210.51 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి 4,73,674 క్యూసెక్కులు, రోజా నుంచి 43,494 క్యూసెక్కులు, మొత్తంగా 5,17,168 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి ఇనఫ్లో వాటర్గా వచ్చి చేరుతోంది.
టెయిల్పాండ్ ఐదు క్రస్ట్ గేట్లు ఎత్తివేత
రెంటచింతల, జూలై 30: సత్రశాలలోని నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టులో రెండు టర్బయిన్ల ద్వారా గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు 0.7147 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ప్రాజెక్టు 5 గేట్లను 0.83 మీటర్ల మేర ఎత్తి 20712 క్యూసెక్కుల నీటిని టేల్ రేస్ ఛానల్ ద్వారా 7,700 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న సాగర్ నుంచి 29,882 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్కు వస్తుంది.