రంగంలోకి కేటీఆర్..ఇన్చార్జ్లతో టెలీకాన్ఫరెన్స
ABN , First Publish Date - 2020-09-25T07:48:36+05:30 IST
శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం
నల్లగొండ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/యాదాద్రి: శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎవరనేది పక్కన పెట్టి, సంస్థాగతంగా చేయాల్సిన పనిపై దృష్టి పెట్టింది. గ్రామస్థాయి ఇన్చార్జి నుంచి మంత్రి వరకు అందరినీ అదే పనిలో పెట్టింది. ఇన్చార్జ్లకు శిక్షణ పూర్తికాగా, సన్నాహక సమావేశాలు తుది దశకు చేరాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఎన్నికల ఇన్చార్జ్లతో గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు నమోదు, ప్రచారం చేయాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అన్ని ఎన్నికల్లో ఘనవిజయం సాధించామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబరు 1న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిఽధులంతా కుటుంబాలతో కలిసి ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు.
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్లో ఎన్నికల ఇన్చార్జి మొగిరెడ్డి శ్రావణికి కేటీఆర్ ఫోన్చేసి సంభాషించారు. ఓటరు నమోదులో అనుమానాలున్నాయా? గ్రామంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారంటూ ఆరా తీశారు. 40 నుంచి 50మంది పట్టభద్రులు ఉంటారని శ్రావణి చెప్పగా, ఓటు నమోదుకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి స్వయంగా ముందుకు వచ్చి ఎన్నికల ఇన్చార్జి బాధ్యత తీసుకున్నట్టు ఆమె వివరించగా, థ్యాంక్యూ బిడ్డా అంటూ కేటీఆర్ అభినందించారు.