GHMC ఆఫీసుపై బీజేపీ దాడి : సీరియస్గా తీసుకున్న KTR.. ఉన్నపళంగా లోనికి వెళ్లి..!
ABN , First Publish Date - 2021-11-26T15:52:45+05:30 IST
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ దాడి కేసులో..
- కార్పొరేటర్లపై మరో సెక్షన్
- మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు
హైదరాబాద్ సిటీ : జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ దాడి కేసులో మరో సెక్షన్ను చేర్చారు. ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని సెక్షన్ 353కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే 32 మంది కార్పొరేటర్లపై ప్రజా ఆస్తుల ధ్వంసం, చట్ట విరుద్ధంగా గుమిగూడడం, అక్రమ చొరబాటు చేసినందుకు 149, 147, 448, 308 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దాడి ఘటనపై వీడియోలు పరిశీలించడంతోపాటు, పోలీసులు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. మేయర్, కమిషనర్ పేషీల్లోని ఉద్యోగులు ఆ రోజు విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులను సైఫాబాద్ పోలీసులు కలిసి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్నారు.
వాస్తవంగా ఉదయం 11 గంటలకు మేయర్ను కలుస్తామని, ఆమె లేకుంటే నిరసన తెలుపుతామని పోలీసులకు బీజేపీ కార్పొరేటర్లు సమాచారమిచ్చినట్టు తెలిసింది. ఉదయం 9.30 నుంచే ఒక్కొక్కరుగా కార్యాలయం వద్దకు వచ్చిన వారు ఉన్నపళంగా లోనికి వెళ్లినట్టు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఆధారంగా మరికొంత మందిపైనా కేసులు నమోదు చేసే అవకాశముంది. కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ నగర కమిషనర్కు సూచించిన అనంతరం.. పోలీసులు కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు.