చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందే కేటీఆర్ విశాఖ వెళ్లాలి: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-03-12T23:07:45+05:30 IST
ఐటీఐఆర్ రాకపోవడానికి మంత్రి కేటీఆరే కారణమని ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: ఐటీఐఆర్ రాకపోవడానికి మంత్రి కేటీఆరే కారణమని ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2018 నుంచి పట్టించుకోకుండా ఇప్పుడు కేంద్రంపై నెపం నెడుతున్నారని, సీఎం కేసీఆర్ అసమర్థత వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని తప్పుబట్టారు. తెలంగాణలో అలీబాబా అరడజను దొంగలు తయారయ్యారని ఎద్దేవాచేశారు. పరిశ్రమల భూముల్ని రియల్ ఎస్టేట్కు అమ్మేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ ద్వారా భారీ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. దోపిడీకి సహకరించడానికి సోమేశ్కు సీఎస్ హోదా ఇచ్చారని పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందే కేటీఆర్ విశాఖ వెళ్లాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.
‘‘కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటానికి టీఆర్ఎస్ తరఫున మద్దతు తెలుపుతున్నామని కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతితో ఉద్యమంలో కూడా పాల్గొంటామని తెలిపారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని మన సోదరులు పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వేలాదిమంది రోడ్డునపడ్డ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు. మీకు మేమందరం నైతికంగా అండగా ఉన్నాం. అవసరమైతే కేసీఆర్ అనుమతి తీసుకొని వైజాగ్కు వచ్చి ప్రత్యక్షం గా మద్దతు తెలుపుతాం. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారు’’ అని కేంద్రంపై కేటీఆర్ మండిపడ్డారు.