కుల్ భూషణ్ జాదవ్కు మరణ శిక్షపై అప్పీలు చేసుకునే అవకాశం
ABN , First Publish Date - 2021-11-18T08:11:09+05:30 IST
: తనకు విధించిన మరణ శిక్షను ఎగువ కోర్టులో అప్పీలు చేసుకోవడానికి కుల్ భూషణ్ జాదవ్కు అవకాశం కల్పిస్తూ పాకిస్తాన్ పార్లమెంట్ చట్టం చేసింది..
ప్రత్యేక చట్టం చేసిన పాకిస్తాన్
ఇస్లామాబాద్, నవంబరు 17: తనకు విధించిన మరణ శిక్షను ఎగువ కోర్టులో అప్పీలు చేసుకోవడానికి కుల్ భూషణ్ జాదవ్కు అవకాశం కల్పిస్తూ పాకిస్తాన్ పార్లమెంట్ చట్టం చేసింది. భారత నేవీ మాజీ అధికారి అయిన జాదవ్ను గూఢచర్యం, తీవ్రవాదం ఆరోపణలతో పాకిస్తాన్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 2017 నుంచి జాదవ్ పాకిస్తాన్లోని జైలులో మగ్గుతున్నారు. పాక్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణ శిక్షను విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ భారత్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)ను ఆశ్రయించింది. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించడానికి, తనకు విధించిన శిక్షపై అప్పీలు చేసుకోవడానికి జాదవ్కు అవకాశం కల్పించాలని ఐసీజేని భారత్ అభ్యర్థించింది. దీన్ని విచారించిన ఐసీజే... భారత్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ మేరకు పాక్ను ఆదేశించింది. దీన్ని అనుసరించి పాకిస్తాన్ పార్లమెంట్ తాజా చట్టం చేసింది.