ర్యాలీలో ‘బలం’ అనుమానమే!

ABN , First Publish Date - 2021-01-21T06:00:18+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీపై ప్రముఖ పారిశ్రామికవత్త కుమార మంగళం బిర్లా ఒకింత అనుమానం వ్యక్తం చేశారు.

ర్యాలీలో ‘బలం’ అనుమానమే!

 కుమార మంగళం బిర్లా

 

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీపై ప్రముఖ పారిశ్రామికవత్త కుమార మంగళం బిర్లా ఒకింత అనుమానం వ్యక్తం చేశారు. రోజు రోజుకీ పెరుగుతున్న కంపెనీల షేర్లలో ఎన్ని ‘తాలు’ కంపెనీల షేర్లనేది పెద్ద ప్రశ్న అన్నారు. మరో మూడు నెలలు గడిస్తేగానీ ఈ ర్యాలీ కొనసాగుతుందో లేదో చెప్పలేమన్నారు. కరోనా వైర్‌సతో వ్యక్తులు, వ్యాపారాలకు వాటిల్లిన నష్టాలను ఏ మాత్రం విస్మరించలేమన్నారు. 


ఇక పెద్దగా పెరగక పోవచ్చు: బోఫా

ఏప్రిల్‌ నుంచి దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగుతున్న ర్యాలీకి ఇక బ్రేక్‌ పడినట్టేనని బోఫా సెక్యూరిటీస్‌ అంచనా. సూచీలు ఇక పెద్దగా పెరగక పోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం 14,644.70  వద్ద ఉన్న నిఫ్టీ డిసెంబరు చివరికిగాని 15,000 పాయింట్ల స్థాయిని అందుకోక పోవచ్చని అంచనా వేసింది. కోవిడ్‌తో గత ఏడాది మార్చిలో 40 శాతం దిద్దుబాటుకు లోనైన సూచీలు గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 80 శాతం పెరిగిన విషయాన్ని బోఫా గుర్తు చేసింది. 


రెండో రోజూ కొనసాగిన జోరు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ రికార్డులతో హోరెత్తింది. కొనుగోళ్ల మద్దతుతో 393.83 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 49,792.12 వద్ద,  123.55 పాయింట్ల లాభంతో నిఫ్టీ 14,644.70 వద్ద ముగిశాయి. రెండు ప్రధాన సూచీలకు ఇది చారిత్రక గరిష్ఠ స్థాయి. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్‌ భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లను పరుగులు తీయించాయి. 


ఇండిగో పెయింట్స్‌ ఐపీఓ: బుధవారం ప్రారంభమైన ఇండిగో పెయింట్స్‌ ఐపీఓ షేర్లకు మదుపరులు ఎగబడ్డారు. దీంతో ఇష్యూ తొలి రోజే 1.24 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది.


ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీఓ: బుధవారంనాడు చివరి రోజున ఐఆర్‌ఎ్‌ఫసీ ఐపీఓకు 3.49 రెట్లు అధిక సబ్‌స్ర్కిప్షన్‌ వచ్చింది. క్యూఊపీల విభాగం 3.78 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం 3.66 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయ్యాయి. 

Updated Date - 2021-01-21T06:00:18+05:30 IST