కుంభమేళాలో నకిలీ కొవిడ్ టెస్టుల కుంభకోణం.. తనకు సంబంధం లేదన్న సీఎం
ABN , First Publish Date - 2021-06-18T22:38:35+05:30 IST
హరిద్వార్లోని కుంభమేళాలో నిర్వహించిన నకిలీ కొవిడ్ పరీక్షల కుంభకోణంలో తన ప్రమేయం
డెహ్రాడూన్: హరిద్వార్లోని కుంభమేళాలో నిర్వహించిన నకిలీ కొవిడ్ పరీక్షల కుంభకోణంలో తన ప్రమేయం లేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ స్పష్టం చేశారు. తాను సీఎం పీఠాన్ని అధిష్టించకముందే ఆ కుంభకోణం జరిగిందని అన్నారు. ఈ ఫేక్ టెస్టుల కుంభకోణంపై జుడీషియల్ విచారణ జరిపించాలన్న మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ డిమాండ్ నేపథ్యంలో తీరథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే కుంభమేళాలో ప్రైవేటు సంస్థలతో కరోనా టెస్టులు చేయించారని అన్నారు. ‘‘ఈ కుంభకోణం పాతది. నేను మార్చిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశా. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించాం. నిందితులపై కఠిన చర్యలు తప్పవు’’ అని తీరథ్ సింగ్ తేల్చిచెప్పారు.
కాగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ మార్చి 10న ప్రమాణ స్వీకారం చేయగా, కుంభమేళా ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు జరగడం గమనార్హం. ఈ కుంభకోణంపై హైకోర్టు న్యాయమూర్తితో నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని త్రివేంద్రసింగ్ రావత్ డిమాండ్ చేశారు. కుంభమేళాలో కొవిడ్ పరీక్షలు నిర్వహించిన ఓ కంపెనీ, రెండు ప్రైవేటు ల్యాబ్లపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిన్న కేసు నమోదు చేసింది.