మరో ఇద్దరి బలి.. 15కు చేరిన శానిటైజర్‌ మృతులు

ABN , First Publish Date - 2020-08-02T15:46:42+05:30 IST

కురిచేడులో శానిటైజర్‌ మృతులు పెరిగిపోతున్నారు..

మరో ఇద్దరి బలి.. 15కు చేరిన శానిటైజర్‌ మృతులు

కురిచేడు(ప్రకాశం): కురిచేడులో శానిటైజర్‌ మృతులు పెరిగిపోతున్నారు. శనివారం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 15కు చేరింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కూలి పనులు చేసుకుని జీవించే వారే శానిటైజర్‌ కాటుకు బలయ్యారు. పోలీసులు గ్రామంలో దండోరా వేసి ఎవరూ శానిటైజర్‌ సేవించవద్దని, దాన్ని ఇప్పటికే తాగి ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే పీహెచ్‌సీకి రావాలని సూచించారు. దీంతో పెద్ద ఎత్తున శానిటైజర్‌ బాధితులు వైద్యశాలకు వచ్చారు.


వారిలో ఇద్దరు శనివారం మృతి చెందారు. వారిలో కురిచేడు వాల్మీకి బజారుకు చెందిన కౌలూరి నరసయ్య (45), మీనిగ నాగేశ్వరరావు(55) ఉన్నారు. వీరిద్దరినీ కురిచేడు పీహెచ్‌సీలో చేర్చి చికిత్స చేయించగా పరిస్థితి విషమించింది. వెంటనే 108లో వినుకొండ ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. మార్గమధ్యంలోనే నరసయ్య మృతి చెందగా నాగేశ్వరరావును వినుకొండలో చేర్చారు.


అక్కడ పరిస్థితి విషమంగా ఉందని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ సాయంత్రం 5గంటల సమయంలో ఆయన ప్రాణాలు విడిచాడు. వినుకొండలో మృతిచెందిన నరసయ్య మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కురిచేడుకు తీసుకొచ్చి ఖననం చేశారు. గుంటూరులో మృతిచెందిన నాగేశ్వరరావు మృతదేహానికి పోస్టుమార్టం చేయాల్సి ఉంది. 


Updated Date - 2020-08-02T15:46:42+05:30 IST