భార్య, ప్రియురాలితో కలిసి..!

ABN , First Publish Date - 2020-10-18T20:07:27+05:30 IST

నాలుగు జిల్లాలో 41 చోట్ల చోరీలు. భక్తుల్లాగా ఆలయంలో నిద్ర చేస్తారు. అదను చూసుకుని అర్ధరాత్రి దొంగతనం చేసి ఉడాయిస్తారు..

భార్య, ప్రియురాలితో కలిసి..!

ఆలయాల్లో నాగప్ప దొంగతనాలు

నాలుగు జిల్లాల్లో.. 41 చోరీలు

పోలీసులకు పట్టుబడ్డ ఫ్యామిలీ గ్యాంగ్‌

16 తులాల బంగారం, 15 కిలోల వెండి స్వాధీనం 


కర్నూలు: నాలుగు జిల్లాలో 41 చోట్ల చోరీలు. భక్తుల్లాగా ఆలయంలో నిద్ర చేస్తారు. అదను చూసుకుని అర్ధరాత్రి దొంగతనం చేసి ఉడాయిస్తారు. భార్య, భర్త, ప్రియురాలు కలిసి దొంగతనాలకు పాల్పడ్డారు. శిరివెళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ నెల 6న మూడు ఆలయాల్లో చోరీ జరిగింది. ఈ కేసును ఛేదించిన పోలీసులకు బోనస్‌గా మరో 40 కేసులకు పరిష్కారం లభించింది. ఎస్పీ ఫక్కీరప్ప, ట్రైనీ ఐపీఎస్‌ అధికారి కొమ్ము ప్రతాప్‌ శివకిషోర్‌, ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు, శిరివెళ్ల సీఐ చంద్రబాబు నాయుడులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. 


మూడు ఆలయాల్లో చోరీతో.. 

శిరివెళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెంకటాపురం గ్రామంలోని నెట్టికంటి ఆంజనేస్వామి దేవాలయం, ఎర్రగుంట్ల గ్రామంలో శ్రీకృష్ణ మందిరంలోనూ, ఆళ్లగడ్డ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బత్తలూరు గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈ నెల 6న రాత్రి చోరీలు జరిగాయి. తలుపులు పగులకొట్టి దేవాలయాల్లోని హుండీ డబ్బులతో పాటు విగ్రహాలపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగతనం చేశారు. దీనిపై శిరివెళ్ల, ఆళ్లగడ్డ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. డీఎస్పీ పోతురాజు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు ఎస్పీ చేశారు. శిరివెళ్ల సీఐ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శిరివెళ్ల ఎస్‌ఐ సూర్యమౌళి, గోస్పాడు ఎస్‌ఐ నిరంజన్‌ రెడ్డి, రుద్రవరం ఎస్‌ఐ రామ్మోహన్‌ రెడ్డి, ఆళ్లగడ్డ రూరల్‌ ఎస్‌ఐ వరప్రసాద్‌, చాగలమర్రి ఎస్‌ఐ మారుతి ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. ఫింగర్‌ ప్రింట్స్‌, డాగ్‌స్క్వాడ్‌, సీసీ టీవీ ఫుటేజీ, క్లూస్‌ టీం సహకారంతో దర్యాప్తు ప్రారంభించారు. ఫింగర్‌ ప్రింట్స్‌, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు నల్లబోతుల నాగరాజును అదుపులో తీసుకున్నారు. విచారిస్తే.. ఈ మూడు కేసులే కాదు.. 41 కేసులు వెలుగులోకి వచ్చాయి. కర్నూలు జిల్లాతో పాటు కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఈ ఏడాదే 23 దొంగతనాలు చేసినట్లు తేలింది. గత మూడేళ్లలో 41 చోరీలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.


అనుమానం రాకుండా.. 

జాతీయ రహదారిలో పక్కనే ఉన్న ఆలయాలను ఎంచుకుని, భార్యతో ఒకసారి, ప్రియురాలితో మరోసారి నల్లప్ప దర్శనానికి వెళతాడు. ముందుగా రెక్కీ నిర్వహిస్తాడు. రాత్రివేళ దైవ సన్నిధిలో నిద్ర చేసేందుకు వచ్చినట్లు నటిస్తారు. అర్ధరాత్రి భార్యను బయట ఉంచుతాడు. ఆలయంలోకి వెళ్లి ఆభరణాలు చోరీ చేస్తాడు. వాటిని ఒక సంచిలో వేసుకుని బైక్‌పై తిరుగు ప్రయాణం అవుతారు. మార్గం మధ్యలో పోలీసులు ఆపినా, పక్కనే మహిళ ఉండటంతో వదిలేసేవారు. 


నాలుగు జిల్లాల్లో..

కర్నూలు జిల్లాలో 5 దేవాలయాలు, ఒక ఇల్లు, కడప జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 11, ప్రకాశం జిల్లాలో రెండు ఆలయాల్లో చోరీ చేశాడు. నిందితుల నుంచి 16 తులాల బంగారు నగలు, 15 కిలోల వెండి నగలు, రూ.23 వేల నగదు, ఒక బైక్‌, రెండు స్మార్ట్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ వెంకటాద్రి, ఫింగర్‌ ఫ్రింట్స్‌ డీఎస్పీ శివారెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.


ప్రశంసాపత్రాలు

కేసును ఛేదించిన ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు, ఫింగర్‌ ప్రింట్స్‌ డీఎస్పీ శివారెడ్డి, శిరివెళ్ల సీఐ చంద్రబాబు నాయుడు, శిరివెళ్ల ఎస్‌ఐ సూర్యమౌలి, గోస్పాడు ఎస్‌ఐ నిరంజన్‌ రెడ్డి, రుద్రవరం ఎస్‌ఐ రామ్మోహన్‌ రెడ్డి, ఆళ్లగడ్డ ఎస్‌ఐ వరప్రసాద్‌, చాగలమర్రి ఎస్‌ఐ మారుతి, హెడ్‌ కానిస్టేబుళ్లు కృష్ణయ్య, మహమ్మద్‌ అలీ, కానిస్టేబుళ్లు కిరణ్‌కుమార్‌, శ్రీనివాసులు, నాగేంద్ర గౌడు, నాగశేషు, గౌస్‌పీరాను ఎస్పీ అభినందించారు. వీరికి ప్రశంసా పత్రాలు అందించారు. 


850 సీసీ కెమెరాల ఏర్పాటు

జిల్లా వ్యాప్తంగా 3,500 ప్రార్థనా మందిరాల్లో 850 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. సీసీ కెమెరాలు లేని ఆలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశాం. నేరాల నివారణకు గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయించి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆలయాల్లో నేరాలు జరిగినప్పుడు రాజకీయాలతో ముడిపెట్టవద్దు.      - ఎస్పీ ఫక్కీరప్ప

Updated Date - 2020-10-18T20:07:27+05:30 IST