Kuwait వెళ్లే వారికి తీపి కబురు.. భారత ప్రయాణికులకు ఉపశమనం!

ABN , First Publish Date - 2021-10-21T14:37:58+05:30 IST

మహమ్మారి కరోనా ప్రభావం రోజురోజుకీ తగ్గుముఖం పడుతుండడంతో కువైత్ నెమ్మదిగా సాధారణ జీవనంవైపు అడుగులేస్తోంది. గడిచిన కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా కొత్త కేసులు తగ్గడంతో పాటు రికవరీలు పెరిగాయి. అలాగే మరణాలు జీరోకు చేరుకున్నాయి. దీంతో ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఆంక్షలు...

Kuwait వెళ్లే వారికి తీపి కబురు.. భారత ప్రయాణికులకు ఉపశమనం!

కువైత్ సిటీ: మహమ్మారి కరోనా ప్రభావం రోజురోజుకీ తగ్గుముఖం పడుతుండడంతో కువైత్ నెమ్మదిగా సాధారణ జీవనంవైపు అడుగులేస్తోంది. గడిచిన కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా కొత్త కేసులు తగ్గడంతో పాటు రికవరీలు పెరిగాయి. అలాగే మరణాలు జీరోకు చేరుకున్నాయి. దీంతో ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఆంక్షలు తొలగించిన తర్వాత కువైత్ ఇటీవల ఎయిర్‌పోర్టుకు డైలీ రావాల్సిన ప్రయాణికుల సామర్థ్యాన్ని 10వేలకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, 10వేలుగా ఉన్న ఈ రోజువారీ ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ఆదివారం(అక్టోబర్ 24) నుంచి పూర్తి సామర్థ్యంతో కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం పని చేస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. ప్రస్తుతం సమ్మర్ హాలీడేస్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తున్న దేశ పౌరులు కూడా భారీ సంఖ్యలో ఉంటున్నారు. 


అలాగే ఇటీవల విదేశీ ప్రయాణికుల రాకపై ఉన్న నిషేధాన్ని కూడా తొలిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పోర్టు సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం కువైత్‌లో 80 శాతం మంది ఒక డోసు, 75 శాతం మందికి రెండు మోతాదుల వ్యాక్సినేషన్ పూర్తైనట్లు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అటు డీజీసీఏ భారత్ నుంచి కువైత్‌కు వచ్చే ప్రయాణికుల కోటాను కూడా పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం వీక్లీ కువైత్‌కు 5,528 మంది భారతీయ ప్రయాణికులు వెళ్లేందుకు మాత్రమే వీలుంది. ఇక ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికుల సంఖ్యపై పరిమితి విధించడంతో విమాన టికెట్ల ధరలు కూడా పెరుగుతాయనే విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులపై అదనపు భారం పడుతుంది. పూర్తి సామర్థ్యంతో విమానాశ్రయం పనిచేస్తే కువైత్ వెళ్లే భారత్ సహా వివిధ దేశాల ప్రయాణికులకు భారీ ఉపశమనం లభిస్తుంది. ఇదిలాఉంటే.. విదేశీయుల రాకపై బ్యాన్‌ను తొలగించిన కువైత్.. కేవలం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే వీసాలు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఇంతకుముందు ఉన్న బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి అనే నిబంధనను తొలగించింది.  

Updated Date - 2021-10-21T14:37:58+05:30 IST