కువైట్ సంచలన నిర్ణయం.. ఉపాధి కోల్పోనున్న లక్షల మంది భారతీయులు !
ABN , First Publish Date - 2020-06-05T17:20:27+05:30 IST
కువైట్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
కువైట్ సిటీ: కువైట్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశ జనాభాలో 70 శాతంగా ఉన్న వలస కార్మికుల సంఖ్యను 30 శాతానికి తగ్గించాలని కువైట్ ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ అల్ హమద్ అల్ సబా నిర్ణయించారు. "మహమ్మారి కరోనా వైరస్ ప్రభావంతో చమురు ధరలు పడిపోయాయి. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు గల్లంతవుతున్నాయి. దాంతో కువైట్ పౌరులకు ఉద్యోగావకాశాలు కల్పించాలంటే ప్రవాసుల సంఖ్యను తగ్గించడం తప్పనిసరి" అని ప్రధాని అల్ సబా అన్నారు. "కాబట్టి భవిష్యత్తులో ఈ జనాభా అసమతుల్యతను సరిదిద్దడానికి మనం పెద్ద సవాలును ఎదుర్కొబోతున్నాం." అని ప్రధాని పేర్కొన్నారు.
కాగా, కువైట్లో 48 లక్షల జనాభా ఉండగా అందులో 34 లక్షల మంది విదేశీయులే ఉన్నారు. ఇందులో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్లకు చెందినవారే అధికమని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రవాసుల్లో 6.5 లక్షల మంది ఇళ్లల్లోనే పని చేస్తున్నారు. కాగా, కువైట్ తీసుకున్న తాజాగా నిర్ణయంతో భారతదేశానికి చెందిన లక్షల మంది ఉపాధి కోల్పోనున్నారు. ఇది కువైట్లో ఉపాధి పొందుతున్న భారత కార్మికులకు చేదు వార్త అనే చెప్పాలి.