కువైట్‌లో 12-15 ఏళ్ల పిల్ల‌ల‌కు.. వ్యాక్సినేష‌న్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌!

ABN , First Publish Date - 2021-06-17T14:54:31+05:30 IST

12 నుంచి 15 ఏళ్ల పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్ కోసం కువైట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

కువైట్‌లో 12-15 ఏళ్ల పిల్ల‌ల‌కు.. వ్యాక్సినేష‌న్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌!

కువైట్ సిటీ: 12 నుంచి 15 ఏళ్ల పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్ కోసం కువైట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు ఆ దేశ ఆరోగ్య‌శాఖ మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. వ్యాక్సినేష‌న్ క‌మిటీ 12-15 పిల్ల‌ల‌కు టీకా కోసం ఆమోదం తెలిపిన‌ట్లు త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. జూలైలో రిజిస్ట్రేష‌న్లు ప్రారంభించి ఆగ‌స్టులో టీకా ఇవ్వ‌నున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అండ‌ర్ సెక్రట‌రీ డా. ముస్త‌ఫా రెడా వెల్ల‌డించారు. సెప్టెంబ‌ర్‌లో పాఠ‌శాల‌లు ప్రారంభం కానుండ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాల‌ని కువైట్ నిర్ణ‌యించింది. అలాగే గ‌ర్భిణిల‌కు సైతం టీకా ఇచ్చే విష‌య‌మై వ్యాక్సినేష‌న్ క‌మిటీ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.


వ్యాక్సిన్లు కొవిడ్‌-19 నుంచి ర‌క్ష‌ణ ఇవ్వ‌డంతో పాటు, మ‌ర‌ణాల‌ను నివారించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని వ్యాక్సినేష‌న్ క‌మిటీ స‌భ్యులు డా. ఖ‌లేద్ అల్ సాయీద్ తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా సంభ‌వించిన క‌రోనా మ‌ర‌ణాల్లో 99.1 శాతం మంది టీకా తీసుకోని వారేన‌ని ఆయ‌న చెప్పారు. అలాగే ఆస్ప‌త్రిలో చేరుతున్న 90.5 శాతం మంది, ఐసీయూలో ఉన్న 89.4 శాతం మంది కూడా వ్యాక్సిన్ వేయించుకోని వారేన‌ని డా. ఖ‌లేద్ వివ‌రించారు. ప్ర‌స్తుతం దేశంలో వినియోగిస్తున్న ఆక్స్‌ఫ‌ర్డ్‌-అస్ట్రాజెనెకా టీకా 92 శాతం సామ‌ర్థ్యంతో ప‌ని చేస్తుంటే, ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ 94 శాతం క‌రోనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని క‌లిగి ఉంద‌ని ఆయ‌న తెలిపారు.    

Updated Date - 2021-06-17T14:54:31+05:30 IST