ఒమైక్రాన్ ఎఫెక్ట్.. కువైత్లో వింత పరిణామం..!
ABN , First Publish Date - 2021-12-06T13:35:08+05:30 IST
దక్షిణాఫ్రికాలో తొలుతు వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్.. ఒమైక్రాన్ కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా ఆంక్షలను తిరిగి కఠినంగా అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి
కువైత్ సిటీ: దక్షిణాఫ్రికాలో తొలుతు వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్.. ఒమైక్రాన్ కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా ఆంక్షలను తిరిగి కఠినంగా అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కువైత్కు వచ్చే ప్రయాణికులకు.. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి కీలక సూచనలు చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులపై ఎటువంటి ప్రయాణ ఆంక్షలు లేవని చెప్పారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి కొన్ని గంటల ముందు పీసీఆర్ టెస్టును చేయించుంటున్నట్టు ఆయన గుర్తు చేశారు. అయితే.. టెస్టు చేయించుకోవడానికి కొద్ది రోజుల ముందు నుంచే సెల్ఫ్ క్వారెంటైన్లో ఉంటే మంచిదని పేర్కొన్నారు. అంతేకాకుండా..ఇప్పటి వరకూ కువైత్లో ఒమైక్రాన్ కేసులు నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వేరియంట్పై అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే ఫైనల్ రిపోర్టును కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఒమైక్రాన్ కారణంగా ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. మొన్నటి వరకూ పరిస్థితి అదుపులో ఉన్నట్టు కనిపించడంతో మాస్కుల విషయాన్ని లైట్ తీసుకున్నారు. కానీ ఒమైక్రాన్ గుబులు పుట్టిస్తుండటంతో.. ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇదే సమయంలో మాస్క్లు ధరించాలని అధికారులు ప్రచారం చేస్తుండటంతో.. కువైత్లో మాస్కుల వినియోగం పెరిగింది. దీంతో మాస్కుల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.