పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-26T06:25:53+05:30 IST
పట్టణానికి సమీపంలోని సత్యనారాయణస్వామి కొండ వద్ద ఓ వ్యక్తి మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు సీఐ ఎల్.భాస్కరరావు తెలిపారు.
అనకాపల్లి టౌన్, నవంబరు 25: పట్టణానికి సమీపంలోని సత్యనారాయణస్వామి కొండ వద్ద ఓ వ్యక్తి మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు సీఐ ఎల్.భాస్కరరావు తెలిపారు. సీఐ కథనం ప్రకారం... పట్టణానికి చెందిన బెల్లం వ్యాపారి నాగేంద్ర వద్ద నాగులాపల్లికి చెందిన పిళ్లా నూకేశ్వరరావు (55) పనిచేసేవారు. ఈ క్రమంలో యజమాని వద్ద రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. అలాగే వ్యాపార కలెక్షన్లో వచ్చిన మొత్తంలో రూ.30 వేలు వాడుకున్నట్టు అభియోగం. ఈ మొత్తాన్ని చెల్లించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నా, బకాయి తీర్చాలని యజమానితో పాటు ఆయన వద్ద పనిచేసే జగన్నాథరావు, శివ, శ్రీను ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో పంచాయితీ పెట్టగా యజమాని నాగేంద్ర హాజరుకాకపోయినా రూ.80 వేలకు సెటిల్మెంట్ జరిగినట్టు చెబుతున్నారు. ఈ నెల 22న నూకేశ్వరరావు తన భార్యతో అనకాపల్లికి వస్తుండగా శివ, శ్రీను, జగన్నాథరావు అడ్డుపడి బకాయి విషయమై డిమాండ్ చేశారు. దీనికి మనస్తాపం చెందిన నూకేశ్వరరావు మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్తో పాటు సెల్ఫీ వీడియోను కూడా నూకేశ్వరరావు తీసినట్టు సీఐ తెలిపారు. మృతుని కుమారుడు ఉదయ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.