Lakhimpur Kheri హింస: కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడికి సమన్లు
ABN , First Publish Date - 2021-10-08T01:42:11+05:30 IST
లఖింపూర్ ఖేరీ హింసకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు
లక్నో: లఖింపూర్ ఖేరీ హింసకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రాకి ఉత్తరప్రదేశ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆయనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు హత్య అభియోగాలు మోపారు. అక్టోబరు 3న లఖింపూర్ ఖేరిలో జరిగిన రైతుల ఆందోళన సమయంలో ఆశిష్ మిశ్రా తన వాహనంతో రైతులను తొక్కించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు.. ఆశిష్ పాండే, లవ్ కుష్లను పోలీసులు గురువారం ప్రశ్నించినట్టు లక్నో రేంజ్ ఐజీ లక్ష్మి సింగ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వారు పలు విషయాలను వెల్లడించినట్టు పేర్కొన్నారు. ఆశిష్ మిశ్రా గురించి గాలిస్తున్నట్టు చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతులపై ఆశిష్ మిశ్రా కాల్పులు జరిపాడని, కారు రైతులను తొక్కించిన సమయంలో ఆయన కారులోనే ఉన్నారని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో తాను కారులో లేనని, తాను బన్వారిపూర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నానని పేర్కొన్నారు.