లఖింపూర్ మృతులకు రూ.45 లక్షల చొప్పున పరిహారం

ABN , First Publish Date - 2021-10-04T20:20:49+05:30 IST

లఖింపూర్ ఖేరిలో ఆదివారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు..

లఖింపూర్ మృతులకు రూ.45 లక్షల చొప్పున పరిహారం

లక్నో: లఖింపూర్ ఖేరిలో ఆదివారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చింది. క్షతగాత్రులకు సైతం రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇస్తుందని యూపీ ఏడీజీ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై రిటైర్డ్ హైకోర్టు జడ్జి దర్యాప్తు జరుపుతారని చెప్పారు. లఖింపూర్ ఖేరిలో ప్రశాంత్ కుమార్ సోమవారం పర్యటించారు. 144 సెక్షన్ విధించినందున జిల్లాలోకి రైతు సంఘాల సభ్యులను మినహా రాజకీయ పార్టీల నేతలను ఎవ్వరినీ అనుమతించమని ఆయన చెప్పారు. కాగా, లఖింపూర్‌ హింసాత్మక ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మృతుల్లో రైతులు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారని తెలుస్తోంది.


కాగా, ఆదివారంనాడు హెలిప్యాడ్ వద్ద నిరసన తెలుపుతున్న రైతులను చెదరగొడుతున్న సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా మూడు వాహనాల్లో అక్కడకు వచ్చినట్టు సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. రైతుల వైపు దూసుకువచ్చిన ఆయన చివర్లో ఎస్‌కేఎం నేత తేజిందర్ సిక్ విర్క్‌పై దాడి చేశాడని, ఆయనపై వాహనం నడిపేందుకు ప్రయత్నించాడని కూడా కిసాన్ సంయుక్త మోర్చా ఆరోపించింది. అయితే, ఎస్‌కేఎం ఆరోపణలను అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు తోసిపుచ్చారు.


Updated Date - 2021-10-04T20:20:49+05:30 IST