కలుషిత గాలికి లక్షలాది మంది భారతీయులు బలి

ABN , First Publish Date - 2020-10-21T20:48:01+05:30 IST

గాలి కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ముఖ్యంగా

కలుషిత గాలికి లక్షలాది మంది భారతీయులు బలి

న్యూఢిల్లీ : గాలి కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ముఖ్యంగా పసి బాలలు పెను ప్రభావానికి గురవుతున్నారు. కలుషితమైన గాలిని ఎక్కువసేపు పీల్చడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఊపిరితిత్తుల కేన్సర్, తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు సంక్రమిస్తాయి. గత ఏడాది ఇటువంటి వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారు మన దేశంలో లక్షలాది మంది ఉన్నారు. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ (ఎస్ఓజీఏ) అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 


ఎస్ఓజీఏ నివేదిక, 2020 తెలిపిన వివరాల ప్రకారం, 2019లో మన దేశంలో మధుమేహం, గుండెపోటు, ఊపిరితిత్తుల కేన్సర్, క్రానిక్ లంగ్ డిసీజెస్, నీయోనాటల్ డిసీజెస్ కారణంగా 16,67,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాలకు కారణమవుతున్న అన్ని రకాల అనారోగ్యాలలో గాలి కాలుష్యం అత్యంత ప్రాణాపాయకరమైనదిగా వెల్లడైంది. 


వేర్వేరు వ్యాధులపై గాలి కాలుష్యం చూపే ప్రభావం గురించి 2019వ సంవత్సరానికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించినపుడు క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్ (సీఓపీడీ) (తీవ్రమైన శ్వాసకోశ సంబంధ వ్యాధి) వల్ల 60 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడైంది. లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వల్ల 43 శాతం మరణాలు, ఐషెమిక్ స్ట్రోక్ కారణంగా 35 శాతం మరణాలు, లంగ్ కేన్సర్ వల్ల 32 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు తేలింది. 


మరింత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, మన దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ పసి పిల్లల మరణాలకు అతి పెద్ద కారణం గాలి కాలుష్యమని వెల్లడైంది. 2019లో మరణించిన పసి పిల్లల్లో 21 శాతం మంది అంటే, 1,16,000 మంది మరణించడానికి కారణం వాతావరణంలోనూ, ఇంట్లోనూ గాలి కలుషితమవడమేనని తేలింది. గర్భిణిగా ఉన్న సమయంలో కలుషిత గాలి పీల్చడం వల్ల తక్కువ బరువుగల బిడ్డలు జన్మిస్తున్నట్లు, నెలలు నిండకుండానే ప్రసవం అవుతున్నట్లు వెల్లడైంది. 


Updated Date - 2020-10-21T20:48:01+05:30 IST