డిక్లరేషన్‌పై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-09-23T22:04:13+05:30 IST

తిరుమల డిక్లరేషన్ విషయంలో వస్తున్న ఆరోపణలపై తెలుగు అకాడమీ చైర్మన్ లక్షీపార్వతి మండిపడ్డారు. ‘ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్లంతా పని

డిక్లరేషన్‌పై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు

అమరావతి: తిరుమల డిక్లరేషన్ విషయంలో వస్తున్న ఆరోపణలపై తెలుగు అకాడమీ చైర్మన్ లక్షీపార్వతి మండిపడ్డారు. ‘ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్లంతా పని పాట లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. డిక్లరేషన్ పేరుతో  అనవసరంగా ప్రభుత్వంపై, సీఎంపై బురద జల్లుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు విపక్షాలకు పట్టడం లేదు. మతం పేరుతో  ప్రజలని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. చెన్నారెడ్డిని దింపేందుకు మత పరమైన అల్లర్లు సృష్టించే వారు కాంగ్రెస్ నేతలు. 1989-1994 మధ్యలో ఇలాగే పాతబస్తీలో అల్లర్లు చేశారు. కాంగ్రెస్ కల్చర్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారో అలాగే ఇప్పడు మతం పేరుతో రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి  కాంగ్రెస్ కల్చర్ ఇంకా చంద్రబాబుకి పోలేదు. ఇప్పుడు టీటీడీ విషయంలో బీజేపీ, టీడీపీ  నేతలు అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నేతలు.. టీడీపీ నేతలు మాట్లాడినట్లే మూర్ఖంగా మాట్లాడుతున్నారు. హిందూ సంప్రదాయం చంద్రబాబు ఎప్పుడు పాటించారో చెప్పాలి. హిందూ మతం పట్ల చంద్రబాబుకు నమ్మకం ఉంటే ప్రజలకు నిరూపించాలి. టీటీడీ కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ముఖ్యమంత్రికి డిక్లరేషన్ వర్తిస్తుందా? సోనియా గాంధీ తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగారా ?చంద్రబాబు ఎప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు?  కాషాయం వేసిన మూర్ఖులు అంతా ఒక చోట చేరారు. హిందూ అనేది ఒక మతం కాదు. హిందూ అనేది ఒక ధర్మం. మతం పేరు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని తెలిపారు.


‘నారా లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేయడం కోసం భువనేశ్వరి క్షుద్ర పూజలు చేసింది. భువనేశ్వరి.. లోకేష్ కోసం చేసిన క్షుద్ర పూజల గురించి బీజేపీ నేతలు అడగాలి. బీజేపీకి అసలు చిత్తశుద్ధి ఉంటే గత సంవత్సరంలో కూడా జగన్  పట్టు వస్త్రాలు సమర్పించారు. అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్రంపై సర్వ హక్కులు ఉంటాయి. రాజు విష్ణువుతో  సమానమని పురాణాలు చెబుతున్నాయి.  రాజుకు మతాలు అంటగట్టడం దారుణం. బీజేపీ, టీడీపీ నేతలు డిక్లరేషన్ గురించి వాస్తవాలు మాట్లాడాలి.  జగన్ ఎప్పుడో హిందువుగా మారారు. గతంలో స్వరూపానంద.. జగన్ మోహన్ రెడ్డిని తీసుకొని గంగా నదిలో పూజలు చేయించారు. గంగా నదిలో మూడు మునకలు మునిగి  హిందువుగా మారారు. కొందరు స్వామీజీలు కాషాయం ధరించి రాజకీయాలు చేస్తున్నారు. ముస్లింగా ఉన్న కరీందాసు, బిబి నాంచారి ఎవరో స్వామిజీలకు తెలీదా? మతం పేరుతో ప్రజల్లో  హింసను రెచ్చగొట్టి  మధ్య యుగంలోకి నెడతారా?సమాజానికి కావాల్సింది  విద్య, వైద్యం కానీ మతం, కులం కాదు. ఇప్పటికైనా రాజకీయ పక్షాలు అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేయాలి. డిక్లరేషన్‌పై బహిరంగ చర్చకు ఎవరితోనైనా నేను సిద్ధం. హిందూ సంప్రదాయం, పురాణలపై నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఖురాన్, బైబిల్, భగవద్గీతను నేను చదివాను. సర్వమతాలను నేను ఆరాధిస్తాను’ అని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-23T22:04:13+05:30 IST