పంటలు పండాలి.. రైతులు లాభాల బాట పట్టాలి
ABN , First Publish Date - 2021-04-14T06:15:32+05:30 IST
రాష్ట్రంలో ఈ ఏడాది పంటలు సంపూర్ణంగా పండి రైతులు లాభాల బాట పట్టాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆదాల విష్ణువర్థన్రెడ్డి తెలిపారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
లాంఫాం(తాడికొండ), ఏప్రిల్ 13: రాష్ట్రంలో ఈ ఏడాది పంటలు సంపూర్ణంగా పండి రైతులు లాభాల బాట పట్టాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆదాల విష్ణువర్థన్రెడ్డి తెలిపారు. లాంఫాంలోని ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2019-2020, 2020-2021 సంవత్సరాలకు గాను దక్షిణ ఆంధ్రా, ఉత్తర ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో వ్యవసాయంలో నూతన ఆలోచనలకు, ఆవిష్కరణల్లో గుర్తించిన ఆరుగురు ఉత్తమ రైతులకు 5 వేల నగదు పురస్కారాన్ని అందజేశారు. 2020 సంవత్సరం రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాలు కృష్ణాజిల్లాకు చెందిన కర్నాటి వివేక్, విశాఖపట్నం జిల్లాకు చెందిన లాలం అచ్చింనాయుడు, కడప జిల్లాకు చెందిన మామిళ్ల మాధవరెడ్డిలకు అందజేశారు. 2021 సంవత్సరానికి గుంటూరు జిల్లాకు చెందిన ఆరుమళ్ల సాంబివరెడ్డి, విజయనగరం జిల్లాకు చెందిన చలుమూరి మాధవరావుకు, అనంతపురం జిల్లాకు చెందిన కానా రామచంద్రరెడ్డికి ఉగాది పురస్కారం అందజేశారు. వ్యవసాయ యాంత్రీకరణలోని నూతన ఆవిష్కరణలకు 2021 సంవత్సరంలో విశిష్ట రైతు పురస్కారం అవార్డు గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ యారగుతి సాంబశివారెడ్డికి దక్కింది. విద్యా, పరిశోధనా, విస్తరణ, పాలనారంగంలో విశేష కృషి చేసి విద్యార్థుల, రైతుల అభ్యున్నతికి పాడుపడిన అధ్యాపకులు, శాస్త్రవేత్తలకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పంచాంగకర్త సత్యనారాయణ పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం అనంతరం వ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు బచ్చు శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ టీ.గిరిధర కృష్ణ, డాక్టర్ ఎన్.త్రిమూర్తులు, డాక్టర్ పులి రాంబాబు, డాక్టర్ ఏ.ప్రతాప్కుమార్రెడ్డి, డాక్టర్ ఎం.మార్టిన్ లూధర్, డాక్టర్ ఎల్.ఉమాదేవి, పీవీ నరసింహారావు, డాక్టర్ రత్నప్రసాద్, డాక్టర్ టీ.గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.