చెరువుల లోతట్టు స్థలాల కబ్జా!

ABN , First Publish Date - 2021-06-19T03:27:55+05:30 IST

మండలంలోని నీటిపారుదల శాఖకు చెందిన పలు చెరువుల లోతట్టు ప్రాంతాలను కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేస్తున్నారు.

చెరువుల లోతట్టు స్థలాల కబ్జా!
ఆక్రమించి చదును చేసిన కొండాయిపాళెం చెరువు లోతట్టు ప్రాంతం

చదును చేసి హద్దుల ఏర్పాటు

ఆక్రమణలలోనూ పోటాపోటీ

పట్టించుకోని అధికారులు  

ఉదయగిరి, జూన్‌ 18 : మండలంలోని నీటిపారుదల శాఖకు చెందిన పలు చెరువుల లోతట్టు ప్రాంతాలను కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేస్తున్నారు. రాజకీయ అండదండలు, అధికారుల సహాయ సహాకారాలతో ఉండడంతో రాత్రివేళల్లో ఎక్స్‌కవేటర్‌తో ముళ్ల చెట్లను తొలగించి చదును చేసి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. ఆక్రమణలలోనూ కబ్జాదారులు పోటీపడుతున్నారు. విషయం తెలిసినా సంబంధిత ఆధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని వెంకట్రావుపల్లి, గంగిరెడ్డిపల్లి చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. వెంకట్రావుపల్లి చెరువు కింద 300 ఎకరాల ఆయకట్టు ఉంది. గంగిరెడ్డిపల్లి చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయా చెరువుల లోతట్టు ప్రాంతాల్లో ఆక్రమణలు జోరుగా సాగుతుండడంతో చెరువు లోతట్టు ప్రాంతం కుంచించుకపోయి నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోతుంది. ప్రస్తుతం చెరువుల కింద ఉన్న పంటలు దెబ్బతినడంతో పాటు రాబోవు రోజుల్లో పంటల సాగు ప్రశ్నార్ధకంగా మారుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మండల ఇరిగేషన్‌ ఏఈ విక్రమ్‌ను వివరణ కోరగా ఆక్రమణల విషయం తమ దృష్టికి రాలేదని, విచారించి అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.



Updated Date - 2021-06-19T03:27:55+05:30 IST