ఆరడుగుల నేల కోసం.. బతికుండగానే వెదుకులాట..!
ABN , First Publish Date - 2020-08-14T15:36:20+05:30 IST
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి పీడీపీ చౌరస్తా సమీపంలోని ఓ వృద్ధురాలు కేన్సర్ బారిన పడి, చివరి దశలో ఉన్నారని కుటుం బసభ్యులు చెబుతున్నారు. ఆమె స్వీకరించిన మతాచారం ప్రకారం తప్పని సరిగా సమాధి చేయాలి
శ్మశానాలు లేక ఇబ్బందులు
రాజేంద్రనగర్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి పీడీపీ చౌరస్తా సమీపంలోని ఓ వృద్ధురాలు కేన్సర్ బారిన పడి, చివరి దశలో ఉన్నారని కుటుం బసభ్యులు చెబుతున్నారు. ఆమె స్వీకరించిన మతాచారం ప్రకారం తప్పని సరిగా సమాధి చేయాలి. కానీ, ఆ కాలనీలో శ్మశానవాటిక లేదు. దీంతో ఆమె బతికుండగానే బంఽ దువులు శ్మశానవాటికలో స్థలం కోసం వెతుకులాట ప్రారం భించారు. తమకు తెలిసిన వారి సహాయంతో స్థలం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
మనిషి బతికి ఉన్నప్పుడే ఆరడుగుల జాగా కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఏర్పడింది.
సర్కిల్ పరిధిలోని పరిసరాలలో పలు నూతన కాలనీలు వెలిశాయి. ఆయా కాలనీల పరిసరాల్లో ఏ సామాజిక వర్గానికి చెందిన శ్మశానవాటికలూ లేవు. సాధారణ రోజుల్లో ఎవరైనా మరణిస్తే పరిసర బస్తీల్లోని శ్మశానవాటికల్లో అడిగి కార్యక్రమం పూర్తి చేసేవారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో బస్తీల్లోని శ్మశానవాటికల్లో స్థలాలు ఇవ్వడం లేదు. దీంతో కొన్ని సామాజిక వర్గాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. తమవారు బతికి ఉండగానే, స్థలాల కోసం వెదుక్కుంటున్నారు.
శ్మశానవాటికలు కేటాయించాలి
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి హ్యాపీ హోమ్స్ కాలనీతోపాటు హ్యాపీ హోమ్స్ టవర్స్ ప్రాంతాలలో ఎవరైనా మరణిస్తే సమాధి చేయడానికి స్థలాలు లేవు. ఈ ప్రాంతాలకు శ్మశానవాటికలు లేవు. ఎవరైనా మరణించినప్పుడు బస్తీలలో ఉండే శ్మశానవాటికలలో స్థానిక పెద్దల సహకారంతో సమాది చేస్తున్నాం. మండలాల వారీగా శ్మశానవాటికలు కేటాయించాలి.
- డాక్టర్ జి. విజయభూషణం, అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా క్రిస్టియన్ మినిస్టర్స్ అసోసియేషన్
దరఖాస్తు చేసుకోవాలి
శ్మశానవాటిక స్థలాల కోసం కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలి. వారు నివేదిక కోరితే ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉన్నాయో తెలియజేస్తాం. దానిని బట్టి స్థానికంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా శ్మశానవాటికలకు స్థలం కేటాయించే వీలుంటుంది.
- చంద్రశేఖర్గౌడ్, తహసీల్దార్, రాజేంద్రనగర్.