హర్నాజ్ సంధును విశ్వ సుందరిగా నిలిపిన సమాధానం ఇదే.. ప్రశంసలతో ముంచెత్తిన లారాదత్తా
ABN , First Publish Date - 2021-12-13T18:11:48+05:30 IST
ఇజ్రాయిల్లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన 21 ఏళ్ల పంజాబ్ సుందరి హర్నాజ్ కౌర్ సంధు విజేతగా నిలిచి కిరీటం దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్డెస్క్: ఇజ్రాయిల్లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన 21 ఏళ్ల పంజాబ్ సుందరి హర్నాజ్ కౌర్ సంధు విజేతగా నిలిచి కిరీటం దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్కు విశ్వ సుందరి కిరీటం దక్కినట్లైంది. గతంలో భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సుస్మితాసేన్ (1994), లారాదత్తా (2000) మాత్రమే సాధించారు. తాజాగా హర్నాజ్ భారత్ నుంచి ముచ్చటగా మూడోసారి విశ్వ సుందరిగా నిలిచారు. అయితే, ఈ పోటీల్లో హర్నాజ్ను విజేతగా నిలిపిన సమాధానంపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఎంతో కాన్ఫిడెన్స్తో ఆమె చెప్పిన ఆ సమాధానం అక్కడి జడ్జిలను బాగా ఆకట్టుకుంది.
మిస్ యూనివర్స్ టాప్-3 ఫైనలిస్టులకు జడ్జిలు అడిగిన ఓ ప్రశ్నకు హర్నాజ్ చెప్పిన సమాధానం ఆమెను విశ్వ వేదికపై విజేతను చేసింది. ఇంతకు ప్రశ్న ఏంటంటే.. "ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న ఒత్తిడిని జయించడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి?" అని జడ్జిలు ఆమెను ప్రశ్నించారు. దీనికి హర్నాజ్ చెప్పిన సమాధానం.. "యువత తమను తాము నమ్మకపోవడమే పెద్ద సమస్య. మొదట మీమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ కోసం మీరు మాట్లాడండి. ఇతరులతో పోల్చుకోకండి. మీ జీవితానికి మీరే లీడర్. నేను దాన్నే నమ్ముకున్న కాబట్టే ఇవాళ ఇక్కడ ఉన్నా" అని అన్నారు. అంతే.. ఈ సమాధానం విన్న అక్కడ ఉన్నవారంతా చప్పట్లతో ఆడిటోరియాన్ని మార్మోగించారు. ఈ సమాధానమే ఆమెను విశ్వ వేదికపై విజేతగా నిలబెట్టింది.
ఇక 21 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మిస్ యూనివర్స్ టైటిల్ సాధించిన ఈ చండీగఢ్ చిన్నదానపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆమెను అభనందనలతో ముంచెత్తుతున్నారు. తాజాగా మాజీ మిస్ యూనివర్స్ లారాదత్తా సైతం హర్నాజ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. 21 ఏళ్ల నిరీక్షణకు తెర దించావు.. శతకోటి కలలను నిజం చేసి మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ హర్నాజ్ను ట్విటర్గా వేదికగా అభినందలు తెలిపారు. "క్లబ్లోకి స్వాగతం. దీనికోసం 21 ఏళ్లు నిరీక్షించాం. ఇవాళ నీవు దాన్ని సాధించి మమ్మల్ని గర్వపడేలా చేశావు. శతకోటి కలలు నిజమయ్యాయి" అని లారాదత్త తన ట్వీట్లో పేర్కొన్నారు.