కలిచెర్లకు కన్నీటి వీడ్కోలు
ABN , First Publish Date - 2022-01-27T05:16:44+05:30 IST
తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్రెడ్డికు అభిమానులు, జనం కన్నీటి వీడ్కోలు పలికారు.
పెద్దమండ్యం, జనవరి 26: తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్రెడ్డికు అభిమానులు, జనం కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అంతిమ యాత్రకు జనం భారీగా తరలివచ్చారు. అంత్యక్రియలు నిర్వహించే బయ్యారెడ్డి స్మృతివనం వరకు అభిమానులు బారులు తీరారు. మధ్యాహ్నం 2:30గంటలకు అంతిమయాత్ర స్మృతివనం చేరుకుంది. జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరుతో పాటు కడప జిల్లా రాయచోట, కడప, అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గాల నుంచి కూడా పెద్దసంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అప్ప అభిమానులు, సన్నిహితులు, కలిచెర్ల మొత్తం వెంటనడవగా అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రభాకర్రెడ్డి అన్న సుధాకర్రెడ్డి చితికి నిప్పు పెట్టి దహనసంస్కారాలు పూర్తిచేశారు. అంత్యక్రియల్లో కడప దర్గా పీఠాధిపతి అరిపుల్లా హుస్సేనీ, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ అమాస రాజశేఖర్రెడ్డి, టీడీపీ నేత రమేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ కుమారుడు శ్రీకాంత్, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రెడ్డిశేఖర్రెడ్డి, నాయకులు రమేష్, ప్రసాద్రెడ్డి, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎంపీటీసీలు, మదనపల్లె, తంబళ్లపల్లె వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.