Telugu Academy Scam : బినామీ ఖాతాలు తెరిచిందెవరు.. ఆ ఇద్దరి కథేంటి..!?
ABN , First Publish Date - 2021-10-08T19:04:09+05:30 IST
ఇప్పటికే రిమాండ్లో ఉన్న నలుగురితో పాటు తాజాగా వెళ్లిన ఆరుగురు కలిపి మొత్తం..
- కస్టడీలో మస్తాన్ వలీ.. కూపీ లాగుతున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ/హిమాయత్నగర్ : తెలుగు అకాడమీ కుంభకోణంలో బుధవారం అరెస్టు అయిన ఆరుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇప్పటికే రిమాండ్లో ఉన్న నలుగురితో పాటు తాజాగా వెళ్లిన ఆరుగురు కలిపి మొత్తం 10మంది చంచల్గూడ జైల్లో ఉన్నారు. వారిలో ప్రధాన నిందితుడిగా ఉన్న యూబీఐ కార్వాన్ శాఖ మాజీ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీని పోలీసులు రెండో రోజు కూడా కస్టడీలోకి తీసుకుని విచారించారు. అతనిచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు మరి కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు లిస్టు తయారు చేసినట్లు సమాచారం.
పరోక్ష సహకారం ఎవరిది..!?
కేసులో ప్రత్యక్షంగా పాల్గొని మోసానికి పాల్పడిన వారిని జైలుకు తరలించారు. అయినా ఇంకా కొందరు చిక్కాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారానికి పరోక్షంగా సహకరించిన వారిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. వారిలో ప్రధానంగా ఎఫ్డీలకు సంబంధించి తెలుగు అకాడమీకి సంబంధించిన లేఖలను ఫోర్జరీ చేయడంలో సహకరించిన వ్యక్తులు... ఎఫ్డీలు జమ అయిన తర్వాత తక్కువ వ్యవధిలో ఉన్న తేదీలను ఏడాదికి ఎఫ్డీ అయినట్లు పత్రాలు సృష్టించిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఎఫ్డీలను బ్యాంకులో జమ చేయడానికి అగ్రసేన్ బ్యాంకులో ఇద్దరి పేర్లను నమోదు చేశారు. వారికి సంబంధించిన గుర్తింపు పత్రాలు నకిలీవి సృష్టించి బినామీ ఖాతాలు తెరవడమే కాకుండా వారిద్దరూ తెలుగు అకాడమీ ఉద్యోగులేనని భ్రమ కల్పించారు. ఆ ఇద్దరు బినామీలు ఎవరు...? వారిని ప్రోత్సహించిందెవరనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.