సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించిన బీహార్ ప్రభుత్వం.. రియా రియాక్షన్ ఇదీ..!

ABN , First Publish Date - 2020-08-04T21:11:48+05:30 IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి సిఫారసు చేసే అధికారం బీహార్ ప్రభుత్వానికి..

సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించిన బీహార్ ప్రభుత్వం.. రియా రియాక్షన్ ఇదీ..!

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి సిఫారసు చేసే అధికారం బీహార్ ప్రభుత్వానికి లేదని నటి రియా చక్రవర్తి తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసు విచారణ అక్కడి పోలీసుల పరిధిలోకి రానప్పుడు సీబీఐ విచారణ కోరడం సాధ్యం కాదని ఆయన అన్నారు. సుశాంత్ తండ్రి అభ్యర్థన మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్టు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై రియా తరపు న్యాయవాది సతీశ్ మనే షిండే ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘బీహార్ పోలీసులు ఈ కేసులో జోక్యం చేసుకుని విచారణ ప్రారంభించే అవకాశం లేదు. కాబట్టి చట్టపరంగా దీన్ని బదిలీ చేయడం సాధ్యం కాదు. పైగా వారు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌కు కూడా ఏమాత్రం విలువ లేనప్పుడు దాన్ని సీబీఐకి ఎలా బదిలీ చేస్తారు?’’ అని ఆయన ప్రశ్నించారు.


సుశాంత్ కేసు తమ న్యాయ పరిధిలో లేదని బీహార్ ప్రభుత్వం గ్రహించిందనీ.. అందుకే సీబీఐ విచారణకు సిఫారసు చేస్తున్నామంటూ ఇప్పుడు ‘‘చట్ట వ్యతిరేక’’ విధానానికి దిగుతోందని న్యాయవాది షిండే పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ముంబై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్టు (ఏడీఆర్) దాఖలు చేసినందున ఈ కేసు బీహార్ పోలీసుల పరిథిలోకి రాదంటూ రియా ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 34 ఏళ్ల సుశాంత్ జూన్ 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. దీనిపై ముంబై పోలీసులు ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే సుశాంత్ సోదరి, రియా, పలువురు సినీ ప్రముఖులు సహా 56 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. 

Updated Date - 2020-08-04T21:11:48+05:30 IST