హుజూరాబాద్లో నామినేషన్లకు రెండు రోజులు సెలవు
ABN , First Publish Date - 2021-10-03T01:12:00+05:30 IST
వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్లకు రెండో రోజే బ్రేక్ పడింది.
కరీంనగర్: వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్లకు రెండో రోజే బ్రేక్ పడింది. ఈనెల 1న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కాగా అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. తొలిరోజే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, అన్న వైఎస్సార్ పార్టీ అభ్యర్థిగా మహ్మద్ మున్సూర్ అలీ నామినేషన్లు వేశారు. 2వ తేదీ శనివారం గాంధీజయంతి సెలవుదినం కాగా, 3న ఆదివారం కావడంతో వరుసగా రెండురోజులు నామినేషన్ల స్వీకరణ నిలిచిపోయింది. నామినేషన్లు వేసేందుకు మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉన్నది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన బల్మూరి వెంకటనర్సింగారావు నామినేషన్లు వేయాల్సి ఉన్నది. ఈనెల 7,8 తేదీల్లో ముహూర్తాలు బాగుండడంతో ఎక్కువ మంది నామినేషన్లు వేస్తారని అనుకుంటున్నారు.