మగ్గిన బియ్యమే దిక్కు

ABN , First Publish Date - 2020-11-23T06:56:20+05:30 IST

మగ్గిన బియ్యం.. పాడైన నిత్యావసర సరుకులే ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కాబోతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలో ప్రారంభంకానున్న సంక్షేమ శాఖ వసతిగృహాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

మగ్గిన బియ్యమే దిక్కు
మూలనపడిన బియ్యం బస్తాలు

ఎనిమిది నెలలుగా హాస్టళ్లలో నిత్యావసరాలు 

 నేటి నుంచి ప్రభుత్వ హాస్టళ్ల ప్రారంభం


చిత్తూరు, నవంబరు 22: మగ్గిన బియ్యం.. పాడైన నిత్యావసర సరుకులే ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కాబోతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలో ప్రారంభంకానున్న సంక్షేమ శాఖ వసతిగృహాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే.. కొవిడ్‌ లాక్‌డౌన్‌తో మార్చి 23వతేది నుంచి హాస్టళ్లు మూతపడ్డాయి. అయితే మార్చి, ఏప్రిల్‌ నెలల నిత్యావసరాల నిల్వలను టెండరుదారులు ఫిబ్రవరి 27న వసతిగృహాలకు సరఫరా చేశారు. వీటిలో బియ్యం, కందిపప్పు, శనగపప్పు, మిర్చి, నూనె, గోధుమ, రవ్వ, కోడిగుడ్లు తదితర 14 రకాలున్నాయి. వీటిని ఎనిమిది నెలలుగా అలాగే ఉంచేయడంతో ముగ్గిపోయి కంపుకొడుతున్నాయి. చింతపండు బూజుపట్టి పనికిరాకుండా పోయింది. అన్ని వసతిగృహాల్లో రూ.కోటి విలువైన వస్తువులు మగ్గిపోయినట్లు అంచనా. వీటిని ఇతర అవసరాలకు తరలించి.. ప్రస్తుతం తాజాగా సరఫరా చేసుంటే బాగుండేది. కాగా, దీనిపై ఓ అధికారికి ఇటీవల ఓ వార్డెన్‌ వివరించగా, మీ బాధలు మీరు పడండని ఉచిత సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో మగ్గిన బియ్యం, నెలలుగా నిల్వ ఉన్న సరుకులతో భోజనం ఎలా వండి పెట్టాలని వార్డెన్లు వాపోతున్నారు. ఈ ఆహారం తిని 119 సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల్లో దాదాపు 10 వేల మంది విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఏంటి పరిస్థితని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-11-23T06:56:20+05:30 IST