తిరుమలలో చిరుత సంచారం
ABN , First Publish Date - 2020-06-03T21:56:11+05:30 IST
తిరుమలలో చిరుత సంచారం అలజడి రేపుతోంది.
తిరుమల: తిరుమలలో చిరుత సంచారం అలజడి రేపుతోంది. లాక్ డౌన్తో ఘాట్ రోడ్డులు మూసివేయడంతో వన్యప్రాణుల సంచారం పెరిగింది. చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. రింగ్ రోడ్డు, కర్ణాటక సత్రం ప్రాంతంలో చిరుత కనిపించింది. రోడ్డు మీద దర్జాగా తిరుగుతూ కెమెరాకు చిక్కింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత సంచారంపై నిఘా పెట్టారు. కర్ణాటక సత్రం ప్రాంతంలో బుధవారం తెల్లవారు జామున చిరుత సంచరించింది.
ప్రస్తుతం సత్రాల్లో ఉన్న భక్తులకు అనుమతి లేకపోవడం, సిబ్బంది కూడా విధుల్లో లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే చిరుత నేరుగా శిలాతోరణం నుంచి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు సీసీటీవీ పూటేజీ ద్వారా గుర్తించారు. మరి కొద్ది రోజులలో తిరుమలకు భక్తులను అనుమతించే అవకాశం ఉందని, భక్త సంచారం పెరిగితే అలికిడి ఉంటుందని, దీంతో జంతు సంచారం తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు.