తిరుపతి రూరల్లో చిరుత సంచారం?
ABN , First Publish Date - 2021-10-24T06:59:46+05:30 IST
తిరుపతి రూరల్ మండలం వెంకటపతినగర్లో చిరుత పులి నడిచిన ఆనవాళ్లు (పాదముద్రలు) కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాదముద్రలు కనిపించడంతో భయాందోళనలో వెంకటపతి నగర్వాసులు
తిరుపతి రూరల్, అక్టోబరు 23: తిరుపతి రూరల్ మండలం వెంకటపతినగర్లో చిరుత పులి నడిచిన ఆనవాళ్లు (పాదముద్రలు) కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ కాలేజీ పరిసరాల్లో చిరుత సంచరించినట్టు పక్కా ఆధారాలు లభించాయి. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి చెర్లోపల్లె సమీపంలోని వెంకటపతి నగర్లోనూ సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎన్జీ రంగా కాలేజీ గోడ దూకి గ్రామంలోకి పులి వచ్చిందని అంటున్నారు. ఈ విషయాన్ని వెంటనే పంచాయతీ అధికారులకు చేరవేయగా, వారు శబ్దం చేయడంతోపాటు మంట వేయడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయిందని పేర్కొంటున్నారు. పైగా ఓ ఇంటి వద్ద ఉన్న కుక్కను లాక్కెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే చిరుతను పట్టుకుని తమకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూడాలని అటవీ శాఖకు విజ్ఞప్తి చేశారు.