పాజిటివ్లు 37% లోపే!
ABN , First Publish Date - 2020-07-05T07:33:34+05:30 IST
తమ దగ్గర చేస్తున్న కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 37 శాతానికి మించి పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదని విజయా డయాగ్నస్టిక్స్ ఎండీ
- పనిభారంతో నెగటివ్ రిపోర్టులు పక్కనబెట్టాం
- పాజిటివ్ తేలిన రిపోర్టులే అప్లోడ్ చేశాం
- విజయా డయాగ్నస్టిక్ ఎండీ సుప్రితారెడ్డి
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తమ దగ్గర చేస్తున్న కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 37 శాతానికి మించి పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదని విజయా డయాగ్నస్టిక్స్ ఎండీ సుప్రితరెడ్డి తెలిపారు. విజయా డయాగ్నస్టిక్స్ నిర్వహించిన కరోనా పరీక్షల్లో 72 శాతం పాజిటివ్ వస్తున్నట్లు వచ్చిన కథనాలపై ‘ఆంధ్రజ్యోతి’ప్రతినిధి అడగ్గా ఆమె వివరణ ఇచ్చారు. విజయా డయాగ్నస్టిక్స్లో ఇప్పటి వరకు 12 వేల నమూనాలను సేకరించామని, అందులో, 4500 పాజిటివ్లు వచ్చాయని తెలిపారు. ఇది 37 శాతం కన్నా తక్కువేనన్నారు. అయితే, పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు అనువైన ఆసుపత్రుల్లో చేరేందుకు వెంటనే నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వారికి ఆలస్యం చేయకుండా ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేసి, నివేదిక ఇచ్చేస్తున్నామని తెలిపారు.
నెగిటివ్ వచ్చిన వ్యక్తుల వివరాలను ఇంకా ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయకపోవడం వల్లే 72% లాంటి అపోహలకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లపై విపరీతమైన పని భారం ఉందని, ఒకటి రెండు రోజుల్లో అందరి ఫలితాలను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని అన్నారు. ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమకు సహకరిస్తున్నారని సుప్రిత రెడ్డి అన్నారు.