అభివృద్ధి పనుల్లో అగ్రగామిగా నిలుద్దాం
ABN , First Publish Date - 2021-10-23T06:44:05+05:30 IST
మండలంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో మండలాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని ఎంపీపీ బొరిగొర్ల ఉషా పేర్కొన్నారు.
దొనకొండ, అక్టోబరు 22 : మండలంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో మండలాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని ఎంపీపీ బొరిగొర్ల ఉషా పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నియోజకవర్గ నాయకుడు మద్దిశెట్టి శ్రీధర్, ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి, తహసీల్దార్ కే.వెంకటేశ్వరరావు, ఎంపీడీవో కేజీఎస్.రాజు, ఎంఈవో సాంబశివరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ రాచగొర్ల వెంకటయ్య, వైస్ ఎంపీపీ వడ్లమూడి వెంకటేశ్వర్లు, సర్పంచ్లు కొంగలేటి గ్రేస్కుమారి, మిండాల మంగమ్మనాగయ్య, వైసీపీ నాయకులు కందుల నారపురెడ్డి, బీఎన్ రాజు, పాతకోట బాలకోటిరెడ్డి, వడ్లమూడి వెంకటాద్రి, పిల్లీ ఒబుల్రెడ్డి, పటాన్ ఇమ్రాన్ఖాన్, బత్తుల వెంకటసుబ్బయ్య, ముజాహిద్, ఉపాధ్యాయులు టి కోటిరెడ్డి, టి రాజశేఖర్, ఆదిమూలపు ప్రభుదాసు, రోశయ్య, దేవానంద్ తదితరులు ఎంపీపీ దంపతులు ఉషా, మురళీలను అభినందించారు. గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికార యంత్రాగంతో సమన్వయంతో ముందుకు సాగాలని మద్దిశెట్టి శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని అన్నీ గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
లింగసముద్రం : మండలంలోని ప్రజలు తమ సమస్యలపై ఇచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ పెన్నా కృష్ణయ్య ఆదేశించారు. మండల పరిషత్ నూతన పాలక వర్గం కొలువు తీరిన తరువాత మొదటి ప్రారంభ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పెన్నా కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్జీలు పరిష్కారం కాకపోతే తన దృష్టికి తేవాలన్నారు. తాగునీటి గురించి జరిగిన చర్చలో లింగసముద్రంలో కొందరు ప్రధాన మంచినీటి పైపులకు అక్రమంగా కుళాయిలు వేశారని కో-ఆప్షన్ సభ్యులు షేక్ షఫీ చెప్పారు. వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి మాధవరావుకు ఎంపీపీ కృష్ణయ్య చెప్పారు. తహసీల్దార్ ఆర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ.. రెవెన్యూ రికార్డుల సమస్యను సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ సందర్బంగా ఏఎంసీ వైస్ చైర్మన్ యం శ్రీనివాసులు మాట్లాడుతూ, ముక్తేశ్వరం గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు. సచివాలయ సిబ్బంది ప్రజా స్రతినిధులను పట్టించుకోవడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు, ఎంపీపీ కృష్ణయ్య, అధికారుల దృష్టికి తెచ్చారు. లింగసముద్రంలోని గ్రంథాలయ స్థలాన్ని ఆక్రమించారని ఆ నిర్మాణాలు నిలిపివేయాలని దాత కోవూరి శ్రీనివాసరావు, కో ఆప్షన్సభ్యుడు షేక్ షఫీలు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు హాజరుకావాల్సిన ఈ సమావేశానికి అన్నెబోయినపల్లి, లింగసముద్రం గ్రామాలకు చెందిన ఇరువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. వీరు సమావేశంలో పలు ప్రశ్నలు లేవనెత్తడం గమనార్హం.