స్టీల్ప్లాంట్లోకి ఏ కమిటీని అడుగుపెట్టనివ్వం
ABN , First Publish Date - 2021-11-27T06:14:45+05:30 IST
విశాఖ స్టీల్ప్లాంట్ను వంద శాతం వ్యూహాత్మక అమ్మకం కోసం కేంద్రం నియమించిన ఏ కమిటీని కర్మాగారంలోకి అడుగు పెట్టనివ్వమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్.నరసింగరావు అన్నారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ హెచ్చరిక
వంటా-వార్పులో కుటుంబాలతో సహా పాల్గొన్న కార్మికులు
ఉక్కుటౌన్షిప్, నవంబరు 26: విశాఖ స్టీల్ప్లాంట్ను వంద శాతం వ్యూహాత్మక అమ్మకం కోసం కేంద్రం నియమించిన ఏ కమిటీని కర్మాగారంలోకి అడుగు పెట్టనివ్వమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్.నరసింగరావు అన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాటంలో భాగంగా శుక్రవారం చేపట్టిన వంటా-వార్పు కార్యక్రమంలో ఆయన పాల్గొని కార్మికులనుద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని ఆరోపించారు. మరో చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ అమ్మకం కోసం ట్రాన్జాక్షన్, లీగల్ అడ్వైజరీలను నియమించిందని, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ దేశంలో అగ్రగామి సంస్థగా, రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్ప్లాంట్ అంటే కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 32మంది ప్రాణత్యాగల ఫలితంగా ఏర్పడిన స్టీల్ప్లాంట్ను రక్షించుకునేందుకు ప్రాణాలైనా అర్పిస్తామన్నారు. కో-కన్వీనర్లు గంధం వెంకటరావు, కేఎస్ఎన్ రావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇదే ధోరణితో వ్యవహరిస్తే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు జంక్షన్లలో సేవ్ స్టీల్ప్లాంట్ అంటూ కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో 77వ వార్డు కార్పొరేటర్ గంగారావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, వైసీపీ నాయకుడు తిప్పల దేవన్రెడ్డి, జనసేన నాయకుడు కోన తాతారావు, కార్మిక సంఘాల నాయకులు వైటీ దాసు, జె.సింహాచలం, మురళీరాజు, మస్తానప్ప, మసేన్రావు, జి.గణపతిరెడ్డి, సీహెచ్.సన్యాసిరావు, గొందేశి సత్యారావు, పులి వెంకట రమణారెడ్డి, నమ్మి నమణ, పరందామయ్య, డీవీ రమణారెడ్డి, మంత్రి శంకర్నారాయణ, మద్ది అప్పలరాజు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.